మంచిర్యాల, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్ను పరామర్శించేందుకు మంగళవారం కేటీఆర్ రానున్నారు. బాల్కసుమన్ను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో సంఖ్యాబలం లేకున్నా పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ చేయని దౌర్జన్యాలు లేవు. పోలీసులు, అధికారుల అండదండలతో ఈ నెల 16వ తేదీ, 17వ తేదీల్లో క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నిక జరుగకుండా వాయిదా వేయించిన విషయం విదితమే. పక్కా పథకం ప్రకారం తొలిరోజు వాయిదా వేయించడం, రెండో రోజు బీఆర్ఎస్ నాయకులను అనుమతించకుండా, కాంగ్రెస్ నాయకులను అనుమతించడంపై ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అక్కడే ఉన్న కాంగ్రెస్ లీడర్లు రాళ్ల దాడి చేయడంతో బీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో కేవలం బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పైగా బాల్కసుమన్ సహా నాయకులు మూల రాజిరెడ్డి, అనిల్, రవికాంత్, తదితరులపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి జైలుకు పంపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. జైలులోనూ బాల్కసుమన్పై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్తో పాటు పలువురు మాజీ మంత్రులు బాల్కసుమన్ను పరామర్శించనున్నారు. అనంతరం స్థానికంగా నిర్వహించే విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడనున్నారు.
బాల్కసుమన్ను విచారించేందుకు నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ మంచిర్యాల జిల్లా కోర్టులో ఫిటిషన్ వేసిన విషయం విదితమే. కాగా, సోమవారం విచారణకు వచ్చిన ఈ ఫిటిషన్లో అసలు పోలీసులు పెట్టిన కేసుకు, కస్టడీకి ఇవ్వాలంటూ కోరిన అంశాలకు పొంతనే లేదంటూ బాల్కసుమన్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో కస్టడీ ఫిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. కస్టడీ ఫిటిషన్కు ముందు బాల్కసుమన్ బెయిల్ పిటిషన్ విచారణకు రాగా, కౌంటర్ ఫిటిషన్ వేసేందుకు పోలీసులు సమయం కోరడంతో బెయిల్ ఫిటిషన్ సైతం నేటికి వాయిదా పడిందని న్యాయవాదులు తెలిపారు.
ఈ సందర్భంగా బాల్కసుమన్ న్యాయవాధులు మీడియాతో మాట్లాడారు. ‘పోలీసులు ఫర్థర్ ఇన్వెస్టిగేషన్ కోసం కోరుతున్న అంశాలేవీ కేసు పెట్టినప్పుడు లేవు. వీరిదగ్గర ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా… వీరి వెంట సమాజ వ్యతిరేక శక్తులు ఉన్నాయా.. ఇతర ప్రాంతాలు(హైదరాబాద్, వరంగల్) వారు ఉన్నారా.. వీళ్లను మానిటర్ చేసింది, వనరులు సమకూరుస్తున్నది ఎవరన్నది తెలుసుకోడానికి నాలుగు రోజులు పోలీస్ కస్టడీ కోరారు. పెట్టిన కేసుకు.. వేసిన కస్టడీ పిటిషన్కు సంబంధం లేదని బలమైన వాదనలు వినిపించాం. వందల సీసీ కెమెరాలు, వందల మీడియా కెమెరాలు ఉన్నాయి.
మరణాయుధాలు ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్-కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య జరిగితే.. కేవలం ఒక పక్షం మీదే కేసు పెట్టడంపై సందేహాలు వ్యక్తం చేశాం. ప్రజాస్వాయ్యాంగా ఎన్నికైన వారికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన గౌరవం కోసం బీఆర్ఎస్ నాయకులు కొట్లాడారని కోర్టుకు వివరించాం. ఇప్పటికైనా ప్రజాస్వాయ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని.. నిజానిజాలను, ఆధారాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. కస్టడీ ఫిటిషన్ను రద్దు చేయడంతో పాటు సుమన్కు బెయిల్ ఇవ్వాలని న్యాయస్ధానం ముందు వాదనలు వినిపిస్తాం.’ అంటూ వివరించారు.