కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో గిరి వికాసం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి అర్హులందరికీ ఫలాలు అందించే విధంగా జరుగుతుందని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజన గ్రామాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు లేని గ్రామాలలో గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. గిరిజన రైతులకు వ్యవసాయ సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
బోరు బావులకు ఎస్.హెచ్.పి. మోటర్లు, వ్యవసాయ బావులకు పంపుసెట్లు, వైల్డ్ లైఫ్ గ్రామాలలో సోలార్ పంపుసెట్లు సౌకర్యాలు కల్పించడంతో పాటు గిరి వికాసం పథకం క్రింద అర్హులైన వారికి నూతన బ్లాకులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం క్రింద ప్రతి నివాసానికి సిద్ధమైన తాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న పైపులైన్లకు మరమ్మత్తులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
వరదల కారణంగా గ్రామాలలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. జిల్లా సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని సమయానుసారంగా అందించాలన్నారు.
మన ఊరు – మనబడి కార్యక్రమంలో మొదటి విడతగా ఎంపికైన పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.