కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లాలోని తిర్యాణి మండలం ఉల్లిపిట్ట గ్రామంలో సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్తో కలిసి వట్టి వాగు ప్రవాహాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వరద ఉధృతి కారణంగా జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు, అడ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ప్రజల సంరక్షణ కోసం అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో పని చేస్తుందని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజలతో సమీక్షించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.