కాళేశ్వరం, ఆగస్టు 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పాత ఆలయ కూల్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే సరస్వతీ, పార్వతీదేవి, ఉప ఆలయాలు, రాజగోపురాల తొలగింపు పనులు పూర్తికాగా, ప్రస్తుతం స్వామివారి గర్భగుడిని తొలగించే ప్రక్రియ కొనసాగుతున్నది.మరో రెండు రోజుల్లో కూల్చివేత పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
సంప్రదాయ ఆలయ శిల్పకళను ఆధునిక సౌకర్యాలతో మేళవించి నూతన ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. 1973లో పునర్నిర్మించిన ఆలయ గర్భగుడి కాలక్రమేణా దెబ్బతినడంతో, ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆలయ సమగ్ర పునరుద్ధరణకు రూ.198 కోట్ల నిధులు మంజూరు చేసింది. కాళేశ్వరాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.