రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలోని గనులు జూన్ నెలలో 131 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఆ ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూన్ మాసానికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడించారు.
బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీకి 2.00 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా.. 131 శాతంతో 2.62 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యిందని జీఎం తెలిపారు. బెల్లంపల్లి ఏరియాకు సింగరేణి సంస్థ నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడం కోసం సమిష్టిగా కృషి చేస్తామన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీపీ ప్రారంభోత్సవం కోసం సింగరేణి యాజమాన్యం తీవ్రమైన కసరత్తు చేస్తుందని స్పష్టంచేశారు.
ఈ ఏడాది స్టేజ్ వన్ అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏరియాలో కార్మికుల సంక్షేమం కోసం కృషిచేయడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా గోలేటి టౌన్షిప్ కార్మిక కాలనీలో నివాసముంటున్న వారికోసం కొత్తగా నాలుగు బోర్లు ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏరియా ఎస్ ఓ టు జీఎం రాజమల్లు, డీజీఎం (ఐఈడీ) ఉజ్వల్ కుమార్ బెహరా, పర్సనల్ హెచ్ఓడీ రాజేశ్వరరావు, సీనియర్ పీఓ ప్రశాంత్ ఉన్నారు.