ఆసిఫాబాద్,జూన్ 30: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జిల్లాలో రెండు నియోజకవర్గాల నుంచి 50 వేల మందికి పైగా ప్రజలు తరలి వచ్చారు. సీఎం కేసీఆర్ వారి అభిమానానికి ముగ్ధులయ్యారు. సీఎం ప్రసంగం ప్రజలను కట్టిపడేసింది. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో అభిమానంతో పెద్ద ఎత్తున ప్రజలు నినాదాలు చేశారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు ప్రజలు ఎంతో శ్రద్ధగా విన్నారు. పోడుపట్టాల పంపిణీని జిల్లా నుంచి ప్రారంభించడంతో పల్లెల నుంచి గిరిజనులు,ఆదివాసీలు ఇంటిల్లిపాది కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు సభా స్థలానికి చేరుకున్న ప్రజలు సీఎం వచ్చే వరకు వేచి ఉన్నారు. సభ సక్సెస్ అవ్వడంతో జిల్లా ప్రజాప్రతినిధులను సీఎం అభినందించారు.
కార్యకర్తల్లో మరింత జోష్..
సీఎం కేసీఆర్ సభతో బీఆర్ఎస్ నాయకుల్లో మరింత జోష్ పెరిగింది. సీఎం కేసీఆర్ ప్రసంగంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప,ఆత్రం సక్కు,ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి పేర్లు చెప్పడంతో అభిమానుల నినాదాలు హోరెత్తాయి. సీఎం కేసీఆర్ ప్రసంగంలో నిధుల కేటాయింపుతో పాటు కాగజ్నగర్లో టెక్నికల్ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో యువత హర్షం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా వర్షం పడుతున్నప్పటికీ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు చేసిన కృషికి ఫలితం లభించింది. సభ సక్సెస్ అవ్వడంతో ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.
గులాబీమయమైన జిల్లా కేంద్రం
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది. రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు గులాబీ తోరణాలను ఏర్పాటు చేశారు. ఇసుక వేస్తే రాలనంతగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. సభా ప్రాంగణం పూర్తి స్థాయిలో నిండిపోవడంతో ప్రజలు రోడ్లపై నిల్చుండి సీఎం ప్రసంగాన్ని విన్నారు.
సమీకృత కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం
అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు ఒకే చోట అందుబాటులో ఉండేలా జిల్లా కేంద్రంలో రూ. 52 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. గిరిజనులకు పోడు పట్టాల పంపిణీకి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వేద మంత్రోచ్ఛారణల మధ్య జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం చేశారు. కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్రావుని కలెక్టర్ కుర్చీలో కూర్చొబెట్టా రు. అనంతరం కలెక్టర్ను సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ని కలెక్టర్ సన్మానించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిజన కుటుంబాలకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.12 మంది లబ్ధిదారులకు సీఎం స్వయం గా పట్టా కాగితాలను అందజేశారు. రైతు బంధు సహాయానికి సంబంధించిన రూ. 23 .56 కోట్ల చెక్కును కలెక్టర్కు అందించారు. ఈసందర్భం గా సీఎం మాట్లాడారు. పోడు భూములకు సంబంధించి గిరిజనులపై ఉన్న అటవీ, పోలీస్ కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దీనికోసం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు. ప్రారంభోత్సవంలో మంత్రు లు ఐకే రెడ్డి, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజన్కుమా ర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, దివాకర్రావు, దుర్గం చిన్న య్య, రేఖానాయక్, విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్మన్లు కోవ లక్ష్మి, రాథోడ్ జనార్దన్, నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీశ్కుమార్, నారదాసు లక్ష్మణ్, టీఎస్ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, మాజీ మంత్రి నగేశ్, లోక భూమారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవం
అభివృద్ధి సంక్షేమం తోపాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం జిల్లాకేంద్రంలో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ భవనాన్ని రూ. 22 కోట్లతో అధునాతన వసతులతో నిర్మించారు. సీఎం కేసీఆర్ ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కొత్త భవవాన్ని ప్రారంభించి ఎస్పీ సురేశ్ కుమార్ని ఎస్పీ కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. ప్రారంభోత్సవంలో మంత్రులు ఐకే రెడ్డి, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజన్కుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, రేఖానాయక్, విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్మన్లు కోవ లక్ష్మి, రాథోడ్ జనార్దన్, నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీశ్కుమార్, నారదాసు లక్ష్మణ్, టీఎస్ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, మాజీ మంత్రి నగేశ్, లోక భూమారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి తదితరులు పాల్గొన్నారు.
కుమ్రం భీం, కొట్నాక్ భీం రావ్ విగ్రహాల ఆవిష్కరణ
ఆదివాసీల పోరాట వీరుడు కుమ్రం భీం విగ్రహంతోపాటు స్థానిక పిల్లల పార్క్లో ఏర్పాటు చేసిన మాజి గిరిజన శాఖ మంత్రి కోట్నాక్ భీం రావు విగ్రహాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవానికి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన సీఎం మొదట కుమ్రం భీం చౌరస్తాలోని కుమ్రం భీం విగ్రహాన్ని ఆతరువాత కోట్నాక్ భీం రావు విగ్రహాన్ని జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.