చారానా కోడికి.. బారానా మసాలా అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. రూ. 164 కోట్లతో పూర్తయ్యే వంతెన అలైన్మెంట్ను మార్చేసి.. రూ. 450 కోట్లతో నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నది. అన్ని అనుకూలతలున్న ప్రదేశాన్ని కాదని, కొత్తగా ల్యాండ్ సేకరించి, నిర్మాణ వ్యయం పెంచేసి మరోచోట కట్టేందుకు యత్నిస్తున్నది. కాగా, ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల జేబులు నింపే వ్యవహారమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంచిర్యాల, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి పెద్దపల్లి జిల్లా అంతర్గాం వరకు గోదావరి నదిపై హెచ్ఎల్బీ(హై లెవల్ బ్రిడ్జి) నిర్మించేందుకు కేసీఆర్ సర్కారు రూ.164 కోట్లు మంజూరు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఈ వంతెనతో మంచిర్యాల, కరీంనగర్-హైదరాబాద్ మధ్య దూరం సుమారు 18 కిలోమీటర్లు తగ్గుతుంది. పైగా ఈ బ్రిడ్జి నిర్మించేందుకు ఎలాంటి భూ సేకరణ చేయాల్సిన అవసరం లేదు. మంచిర్యాల పట్టణంలో గోదావరి ఒడ్డునున్న శివాలయానికి ఎడమవైపున.. ప్రస్తుతం ఉన్న సీసీరోడ్డుతో కలుస్తుంది.
అంతర్గాం వైపు అంతర్గాం గ్రామం నుంచి బసంత్నగర్ వెళ్లే ప్రస్తుత డబుల్ లేన్ బీటీ రోడ్డులో కలుస్తుంది. దీంతో రామగుండం-మంచిర్యాల రెండు పట్టణాల మధ్య యాక్సెసిబిలిటీ మెరుగవుతుంది. పైగా ఈ బ్రిడ్జి కావాలనేది మంచిర్యాల పట్టణ వాసుల చిరకాల వాంఛ. ఇవేవి పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బ్రిడ్జి అలైన్మెంట్ను మార్చేందుకు సిద్ధమైంది. మంచిర్యాల-అంతర్గాం మధ్యలో కాకుండా ముల్కల్ల నుంచి ముర్ముర్(బసంత్నగర్)కు బ్రిడ్జి వేస్తామని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పట్టణానికి ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పారు.
అంతర్గాం బ్రిడ్జి వేస్తే ఎత్తు పెంచాల్సి వస్తుందని, దానితో కాలేజీ రో డ్డులోని ఇండ్లకు ఇబ్బంది అవుతుందని చెప్పా రు. వాస్తవానికి ఆ బ్రిడ్జి అలైన్మెంట్ ఇండ్ల వరకు వచ్చే పరిస్థితి లేదు. పోనీ ట్రాఫిక్ ఇ బ్బందేమైనా వస్తుందా.. అంటే అదీ లేదు. పట్టణం చుట్టూ వచ్చే 100 ఫీట్ల రోడ్డుకు దీన్ని అనుసంధానిస్తే సరిపోతుం ది. కానీ, కావాలనే బ్రిడ్జిని తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారను తీసుకువచ్చిన కొత్త ప్రతిపాదన ప్రకారం మంచిర్యాల పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పంప్ హౌస్ సమీపంలోని ముల్కల గ్రామం వెళ్తుంది.
కానీ మంచిర్యాల పట్టణవాసులకు దీంతో తగ్గేదూరం కేవ లం 5 కిలోమీటర్లే కావ డం గమనార్హం. పైగా దీనికి ఖర్చు కూడా రూ. 50 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమి క అంచనాకు వచ్చినట్లు తెలిసింది. వంతెన నిర్మాణానికి ఇటు ముల్కల నుంచి అవతలి పక్కనున్న ముర్ముర్ వరకు 14కిలోమీటర్ల మేర భూ సేకరణ చే యాల్సి ఉంటుంది. దీంతోనే ప్రాజెక్ట్ వ్యయం రెండింతలు పెరుగుతున్నట్లు తెలిసింది.
మంచిర్యాల దాటుకొని ముల్కల్ల దాకా వెళ్లి బ్రిడ్జి ఎక్కాల్సిన అవసరం ఏముందని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాలకు సంబంధించి హజీపూర్ మండల కేంద్రం నుంచి మంచిర్యాలతో పాటు ఆసిఫాబాద్ జిల్లా వాసులు అందరూ మంచిర్యాల మీదుగానే కరీంనగర్, హైదరాబాద్కు వెళ్తారు. అదే లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం వాసులు లక్షెట్టిపేట మీదుగా కరీంనగర్ వెళ్తారు. ఆ ఏరియా నుంచి మంచిర్యాల దాకా ఎవరూ రారు. అలాంటప్పుడు జిల్లా కేంద్రం శివారులోనే బ్రిడ్జి ఉంటే బాగుంటుంది. మంచిర్యాల నుం చి అంతర్గా వరకు దాదాపు 18 కిలోమీటర్ల దూరభారం తగ్గుతది.
అదే ముల్కల్ల-ముర్ముర్ బ్రిడ్జితో అయితే మంచిర్యాల నుంచి ముల్కలకు వెళ్లి అక్కడి నుంచి ముర్ముర్ వెళ్లి, అక్కడి నుంచి అంతర్గాంకు రావాల్సి ఉంటుం ది. దీంతో తగ్గేదూరం కేవలం ఐదు కిలోమీటర్లే.. దాని కోసం ముల్కల్ల దాకా పోయే బదులు ఇప్పుడు ఏదైతే ఇందారం క్రాస్ రోడ్డు నుంచి వెళ్లే మార్గం ఉందో.. అదే బెటర్ ఆప్షన్ అవుతది. అలాంటప్పుడువరికీ నష్ట లేకుండా కేసీఆర్ సర్కారు చేసిన అలైన్మెంట్ ప్రకారం మంచిర్యాల నుంచి అంతర్గాం వరకే బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది.
ఎలా చూసినా ముల్కల్ల దగ్గర కొత్త ప్రతిపాదనకంటే ఇప్పటికే టెండరైన పాత ప్రతిపాదన ప్రకారం బ్రిడ్జి నిర్మించడం మంచిదనే అభిప్రాయాన్ని ఆర్అండ్బీ అధికారులే వ్యక్తం చేస్తున్నారు. ముల్కల్ల, వేంపల్లి శివారుల్లో రియల్ ఎస్టేట్ బడా వ్యాపారులు ఉండటం, ఇప్పటికే ఎన్హెచ్-63 సైతం అక్కడి నుంచే వెళ్తుండటం.. తాజాగా ఈ బ్రిడ్జిని కూడా అటువైపే తరలిస్తామనడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కేవలం బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల జేబులు నింపేందుకు కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జనాభీష్టం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటుందా.. లేకపోతే కమమీషన్ల కోసమో, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మెప్పు కోసమో.. బ్రిడ్జిని తరలించుకుపోతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.