రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించలేదు. కేసీఆర్ ప్రభుత్వం సమయానుకూలంగా ఎన్నికలను నిర్వహించింది. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చి పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మార్చేసింది. 60 ఏండ్ల పాలనలో జరగని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపించింది. ఇప్పుడు అట్లా కాంగ్రెస్ గెలిచిందో లేదో ఇట్లా ఎన్నికలకు అడ్డుకట్ట వేసింది. ప్రత్యేక పాలన తెచ్చిందంటూ గ్రామాల్లోని నాయకులు, ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఎంపీ ఎన్నికలు ఎప్పుడైపోతాయి.. కులగణన ఎప్పుడు చేస్తారు.. రిజర్వేషన్లపై ఎప్పుడు స్పష్టత వస్తుంది.. ఆరు గ్యారెంటీల అమల్లోకి ఎప్పుడు వస్తాయి.. ఇవన్నీ అయ్యే దాకా ఎన్ని రోజులపాటు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. అనే విషయాలపై సందిగ్ధత నెలకొంది.
మంచిర్యాల, జనవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీ(జీపీ)ల్లో ప్రత్యేక పాలనకు రంగం సిద్ధమైంది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ హయాంలోనే పంచాయతీల్లో ప్రత్యేక పాలన ఉండేది. ఇప్పుడు అదే రిపీట్ కానున్నది. జీపీ పాలకవర్గాల గడువు ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ పూర్తి కావాలి. కానీ.. కొత్త సర్కార్ ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. పంచాయతీరాజ్ కొత్త చట్టాన్ని అనుసరించి పదవీకాలం పూర్తయ్యాక ఆయా పాలకవర్గాలను పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగించేందుకు కొత్త చట్టం అనుమతించడం లేదు. ఇప్పటికిప్పుడు చట్ట సవరణ చేయడం లేదా ఆర్డినెన్స్ తీసుకురావడం సాధ్యమయ్యే విషయం కాదు. దీంతో ఎలా చూసుకున్నా పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన తప్పేలా లేదు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిన సర్కారు రెండు, మూడు రోజుల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ఉత్తర్వులను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికలకు ముందు పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు త్వరలోనే కులగణన చేపడుతామని పేర్కొంది. దీంతో ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పు తప్పనిసరి అయ్యింది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు పదేళ్లపాటు అమలులో ఉంటాయి. 2018లో ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఖరారు చేసిన రిజర్వేషన్ల లెక్క ప్రకారం 2028 వరకు అమలులో ఉండాలి. కానీ.. ప్రస్తుత ప్రభుత్వ ఎన్నికల హామీ మేరకు కుల గణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను నిర్ణయించే వరకు పంచాయతీలకు ఎన్నికలు ఉండేలా లేవు.
మరోవైపు లోక్సభ ఎన్నికలు ముందస్తుగా వస్తుండడం, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రానుండడం పంచాయతీ ఎన్నికల వాయిదాకు మరో కారణంగా తెలుస్తున్నది. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎంపీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దానికి ముందు ఆరు గ్యారెంటీల అమలుకు అవసరమైన సర్వే పూర్తి చేయించి జనంలోకి వెళ్లాలని వ్యూహరచన చేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తున్నది. గ్యారెంటీలు అమలు చేయకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే చాన్స్ ఉందని పార్టీ అధిష్టానం భావిస్తున్నది. ఈ మేరకు ముందు ఎంపీ ఎన్నికల అనంతరం గ్యారెంటీల అమలు అయ్యాక గానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా కనిపించడం లేదు.
గ్రామ పంచాయతీల్లో ఇన్చార్జిలుగా మండల స్థాయి అధికారులను నియమించనున్నట్లు తెలుస్తున్నది. లోక్సభ విధులతో సంబంధం లేకుండా ఉండే మండల స్థాయిలోని అధికారులను పంచాయతీలకు ఇన్చార్జిలుగా నియమించనున్నట్లు సమాచారం. ఎంపీడీవోలు, ఎంపీవోలు, తహసీల్దార్లు, గెజిటెడ్ హోదా ఉన్న ఇతర శాఖల అధికారులకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు. ఆయా మండలాల్లోని పంచాయతీల ఆధారంగా ఇతర శాఖల అధికారుల సేవలను ఉపయోగించుకోనున్నారు. చిన్న గ్రామాలైతే రెండు, మూడు గ్రామాలకు ఒకే అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇతర శాఖల అధికారుల అవసరం రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.