బైంసా, ఫిబ్రవరి, 12 : ముథోల్ నియోజకవర్గం అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులను కోరినట్లు ఆదివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో మినీ స్టేడియం, పల్లె దవాఖానతో పాటు వివిధ అభివృద్ధి పనులకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. భైంసా పట్టణంలో అర్బన్ పార్కు ఏర్పాటు చేయాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. భైంసా శివారు కాలనీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెలడించారు. నియోజకవర్గంలో అవసరమున్న చోట పల్లె దవాఖానలు, పైర్ స్టేషన్లు, వెటర్నరీ వైద్యశాలలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గానికి నూతనంగా మూడు సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని, మరొకటి అదనంగా మంజూరు చేయాలని విన్నవిం చారు.
అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులకు నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలో పలు చోట్ల షాదీఖానాల పనులు కొనసాగుతున్నాయని, వాటికి నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల మంత్రులు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. త్వరలో నిధులు కేటాయిస్తామని, సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసకుంటామని మంత్రులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ముథోల్ నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం దేవాలయాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని తెలిపారు. షాదీముబారక్ లబ్ధిదారులకు రూ. 2.70 కోట్లు నిధులు మంజూరు చేసిందని , త్వరలో చెక్కులు అందిస్తామని వెల్లడించారు.