బోయినపల్లి రూరల్/ హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన జోగినిపల్లి శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన, గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. శ్రీనివాసరావు అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ సుచిత్రలోని టీచర్స్ కాలనీ స్వర్గధామంలో నిర్వహించనున్నారు.
శ్రీనివాసరావు మరణవార్త తెలియగానే కొదురుపాకతోపాటు మండలంలోని గ్రామాల్లో విషాదఛాయలు అలుముకోగా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్కుమార్, మాజీ మంత్రి హరీశ్రావు, కేసీఆర్ సతీమణి, శ్రీనివాసరావు సోదరి శోభమ్మ, మరో సోదరి శశికళ, బావ రవీందర్రావుతోపాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, పలువురు నాయకులు సుచిత్రకు చేరుకుని శ్రీనివాస్రావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తంచేశారు.
శ్రీనివాసరావుకు బోయినపల్లి మండలం తడగొండ ప్రజలతో విడదీయలేని బంధం ఉంది. కుల, మత, పార్టీలకతీతంగా అందరితో కలివిడిగా ఉంటూ, ఎల్లవేళలా సమాజసేవలో తనవంతు సహాయ, సహకారాలు అందించేవారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా, పోచమ్మ ఆలయాలు, అంబేద ర్ విగ్రహానికి విరాళాలు, ఉత్సవాలు, జయం తి వేడుకలకు ఆర్థిక సాయం అందించారు. 15 ఏండ్లుగా ఏటా రంజాన్ తోఫాను ముస్లింలకు అందించి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఎంతోమందికి చేయూత అందించిన మనిషిని తమ నుంచి దేవుడు దూరం చేశాడని గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు.