భీంపూర్, నవంబర్6: భీంపూర్ మండలం వడూర్ పెన్గంగ రేవు ఒడ్డున ఆదివారం రాత్రి కోటి దీపోత్సవం నిర్వహించారు. గంగమ్మకు పూజలు చేసి మహా హారతి ఇచ్చారు. మండలంతో పాటు సమీప మహారాష్ట్ర సరిహద్దులోని భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. యాగం చేశారు. స్వామి శివానంద భారతి ఆధ్వర్యంలో కార్తీక చాతుర్మాస్య పూజలు జరిపించారు.
రాత్రి వేళ పెన్గంగ దీపాల వెలుగులో శోభాయమానంగా మారింది. సుమారుగా 45 గ్రామాల నుంచి 2 వేల మంది హాజరయ్యారు. భక్తులకు అన్నదానం చేశారు. సోమవారం తెల్లవారుజామున గంగలో చక్రస్నానం, హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సర్పంచ్ కాసవేణి హనుమద్దాసు, ఉపసర్పంచ్ వెంకటస్వామి , నాయకులు సంజీవ్రెడ్డి, అనిల్, హన్మాండ్లు, గంగన్న, వీడీసీ ప్రతినిధులు సౌకర్యాలు సమకూర్చారు. ఎస్ఐ రాధిక సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు.
సొనాలలో..
బోథ్, నవంబర్ 6 : మండలంలోని సొనాల గ్రామంలోని రామాలయంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక హిందూ ధర్మ జాగరణ మండల శాఖ ఆధ్వర్యంలో తులసి, దామోదర కల్యాణం నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై దీపారాధన చేశారు. వేదపండితులు కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. వివిధ ఆకృతుల్లో చేపట్టిన దీపాలంకరణలు ఆకట్టుకున్నాయి.