ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 12 : చీకటి జీవితాలకు కంటి వెలుగు ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 34వ వార్డు పరిధిలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రెండో విడుత కంటి వెలుగు శిబిరాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. శిబిరానికి వచ్చే ప్రజలకు ఎలావంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కంటి పరీక్షల తీరును పర్యవేక్షించి పలువురికి కండ్ల అద్దాలు పంపిణీ చేశారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు.
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 12 : మండలంలోని సాలేవాడ(కే) గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు శిబిరం నిర్వహించారు. డాక్టర్ రాథోడ్ ప్రవీణ్, ఆప్తోమెట్రిస్ట్ ప్రమోదిత 145 మందికి కంటి పరీక్షలు చేశారు. అదేవిధంగా హస్నాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కామాయిపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ హరిప్రియ, ఆప్తోమెట్రిస్ట్ శాంతిప్రియ 116 మందికి కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమలో సూపర్వైజర్ కృప, హెల్త్ అసిస్టెంట్ శ్రీరాం, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
గుత్పాలలో 117 మందికి పరీక్షలు
నేరడిగొండ, ఏప్రిల్ 12 : మండలంలోని గుత్పాల గ్రామంలో నిర్వహించిన శిబిరంలో 117 మంది కంటి పరీక్షలు చేసినట్లు డాక్టర్ స్వప్న తెలిపారు. ఆరుగురికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, నలుగురికి కండ్ల అద్దాల కోసం రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురిని శస్త్ర చికిత్స కోసం రెఫర్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రాంనరేశ్, సిబ్బంది నర్సయ్య, సాయన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.
97 మందికి కంటి పరీక్షలు
భీంపూర్, ఏప్రిల్12: వడ్గాం గ్రామంలో బుధవారం 97 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డాక్టర్ అశ్విని తెలిపారు. ఒకరికి అద్దాలు అందజేసి, 12 మందిని కంటి ఆపరేషన్ల కోసం గుర్తించామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, సూపర్వైజర్ గంగాధర్, సిబ్బంది జనాబాయి, విష్ణు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
తేటగా కనిపిస్తున్నయ్..
ఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 12 : మాది నిరుపేద కుటుంబం. రోజు పనిచేస్తేనే ఇల్లు గడుస్తది. నేను చాలా రోజుల నుంచి కంటి సమస్యతో బాధపడుతున్న. ప్రైవేట్ దవాఖానలో చూపించుకునే స్థోమత లేదు. ఈ మధ్య గవర్నమెంట్ డాక్టర్లు మా వార్డులో కంటి వెలుగు శిబిరం పెట్టారు. పరీక్షలు చేయించుకున్న. మందులు, కండ్లద్దాలు ఇచ్చారు. ఇప్పుడు కండ్లు తేటగా కనిపిస్తున్నయ్. ఇంటి, కూలీ పనులు చేసుకుంటున్న. ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం సారుకు రుణపడి ఉంట. – ఓరుగంటి లక్ష్మి, ఖానాపూర్(నిర్మల్ జిల్లా)