ఉపాధి హామీ పథకం ద్వారా కల్లాల కోసం వెచ్చించిన నిధులను వెనక్కి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న కేంద్రంపై కర్షకులు కన్నెర్ర చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన నిరసనల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రాథోడ్ బాపు రావ్, రేఖా నాయక్, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, కోవ లక్ష్మి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుంటే, మోదీ సర్కారు మాత్రం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఇకనైనా వెనక్కి తగ్గకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
– ఆదిలాబాద్/నిర్మల్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ)
అన్నం పెట్టే రైతులకు గింత అన్యాయం చేస్తున్నరు. కేంద్రానికి గింత కండ్ల మంట ఎందుకో అర్థమైతలేదు. పంట కల్లాలపైన కూడా కక్ష కట్టిన్రంటే వీళ్లను ఏమనుడు. కల్లాల పైసలు తిరిగివ్వాలని మా గోస పోసుకుంటున్నరు. మోదీ సర్కారు మాకు చేసిందేమీలేదు. సీఎం కేసీఆర్ ఒక్కరే మా బాధలు అర్థం చేసుకున్నరు. ఆయన గింత మంచి పనులు చేస్తుంటే అడ్డం పడుడే పనిగ పెట్టుకున్నరు. వచ్చే ఎలక్షన్లో ఈ బీజేపోళ్లకు బుద్ధి చెప్పి తీరుతం.
-చిట్యాల లింగన్న. రుయ్యాడి, తలమడుగు
ఆదిలాబాద్/నిర్మల్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కల్లాల కోసం వెచ్చించిన నిధులను వెనక్కి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న కేంద్రంపై కర్షకులు భగ్గుమన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నాలు నిర్వహించారు. గుజరాత్లో సముద్ర తీరాల్లో చేపలు ఎండబెట్టుకునేందుకు ఉపాధి హామీ ద్వారా కల్లాలు నిర్మించిన మోదీ సర్కారు, తెలంగాణ రైతులపై మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కల్లాల కాడికివచ్చే బీజేపీ నాయకులను తరిమి కొడతామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మాజీ విప్ నల్లాల ఓదెలు, యువనాయకుడు విజిత్రావు, డీసీఎంఎస్ చైర్మన్ తెప్పని లింగయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మోట పలకుల గురువయ్య, మున్సిపాలిటీల చైర్మన్లు, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రైతు సమన్వయ సంఘాల అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో..
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరిస్తే బీజేపీకి మనుగడ ఉండదనే భయంతోనే కుట్రపూరిత చర్యలకు పాల్పడుతుందన్నారు.
రైతుల సౌకర్యం కోసం ఈజీఎస్ ద్వారా నిర్మించిన కల్లాలకు ఖర్చుచేసిన నిధులను వెనక్కి ఇవ్వాలని కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి రైతులను మోసం చేయడమే పనిగా పెట్టుకుందని, రైతుల ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం బండి సంజయ్కి లేదన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తున్న కేంద్ర న్రభుత్వంపై ఉద్యమం చేసేందుకు మారోసారి తెలంగాణ ప్రజానికం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ అన్యాయాలను దేశానికి తెలియజేసేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని అన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతిపత్రం సమర్పించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, రైతు బంధు జిల్లా గౌరవ అధ్యక్షుడు జగ్గాగౌడ్, జడ్పీటీసీలు అజయ్, దుర్పాబాయి, రామారావు, సంతోష్ , ఎంపీపీలు మల్లికార్జున్ యాదవ్, విశ్వనాథ్, విమలాబాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవేణి మల్లేశ్, భగవంత్రావ్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, నాయకులు సంజీవ్, అన్సారీ, సాజిద్, ఇంతియాజ్లాల, సలాం ఎస్కే హైమద్, హైమద్బిన్ అబ్దుల్లా, నిసార్, అమలు ఇరుకుల్లా మంగ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో..
నిర్మల్లోని కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో వందలాది మంది రైతులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, అంకం రాజేందర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి చైర్మన్ వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మంత్రితో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ర్యాలీగా బయలుదేరి ధర్నా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ… త్వరలోనే దేశానికి బీజేపీ పీడ విరగడవుతుందని, సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ దేశంలో వివిధ పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట కల్లాలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇతర రాష్ర్టాల్లో చేపల ఆరబోతకు కల్లాలు నిర్మించుకుంటే ఉపాధి హామీ నిధులిస్తూ, తెలంగాణపై మాత్రం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. కల్లాలు ఎందుకు నిర్మిస్తారో కూడా తెలియని పరిస్థితిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ రైతులు బాగుపడాలని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే… కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ రైతన్నల కడుపు కొడుతున్నదని మండిపడ్డారు. ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో రూ.12 కోట్లతో 19 వేల పంట కల్లాలను రైతులు నిర్మించుకున్నారని, ఇప్పుడు వాటికి నిధులు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులతో కలిసి ఎమ్మెల్యేలు, గులాబీ శ్రేణులు అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో..
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులతో రైతులు పంట కల్లాలు నిర్మించుకుంటే కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతున్నదని, డబ్బులు తిరిగి చెల్లించమనడం మోదీ ప్రభుత్వ దిగుజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధిని ఓర్వలేకే మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని స్పష్టం చేశారు.
తగిన బుద్ధి చెబుతాం
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నది. భూమినే నమ్ముకొని బతికే రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం సరికాదు. రైతులు, కూలీలకు అన్నంపెట్టే ఉపాధి హామీ పథకాన్నే ఎత్తేయాలని చూస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం రైతుల బాగు కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నది. ఇకనైనా మారకుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతాం.
– దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ది గొప్ప మనసు
ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానించాలని సీఎం కేసీఆర్ ముందు నుంచి కోరుతున్నారు. కేంద్ర స్పందించకున్నా గొప్ప మనసుతో ఉపాధి హామీ కింద రైతులకు ఉపయోగపడే పనులు చేయిస్తున్నరు. కల్లాలు, కందకాలు తవ్విస్తున్నరు. ఇవన్నీ చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టాలని చూస్తుంది. రైతులను కష్టపెట్టే పనులు చేయొద్దు, కల్లాల డబ్బులు తిరిగి ఇవ్వాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
– నల్లాల భాగ్యలక్ష్మి, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్
నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాడుతాం
దేశంలోని రైతులంతా సీఎం కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు. గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి. కానీ ఇవాళ దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూస్తుంది. దీంతో గుజరాత్ మోడల్ అంటే బోగస్, వాట్సాప్ యూనివర్సిటీ మోడల్ తప్ప ప్రజలకు సంతోషపెట్టే, రైతులను ఆదుకునే మోడల్ కాదని దేశం మొత్తం అర్థమైంది.
తెలంగాణకు అన్యాయం జరిగితే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. దేశానికి బీజేపీ ఆధ్వర్యంలో అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. కేసీఆర్ ఎలాగైతే ఈ రోజు తెలంగాణకు న్యాయం చేస్తున్నారో.. భవిష్యత్తులో యావత్ భారత దేశానికి న్యాయం చేస్తారు. మోదీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టే నిర్ణయాలు వెనక్కి తీసుకునే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో సైనికులమై రైతుల పక్షాన పోరాడుతాం.
– నడిపెల్లి విజిత్రావు, యువనాయకులు మంచిర్యాల