ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై పెట్టిన నమ్మకం మేరకు పనిచేస్తానని ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అందరితో కలిసి మెలసి ఉండే నాయకుడిగా, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు చెప్పారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నేరవేర్చుతానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అనుకున్న విధానంలో పనిచేసి అందరి సహకారంతో జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను అధిష్టానం బుధవారం ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, నిర్మల్కు ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్రెడ్డి, మంచిర్యాలకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కుమ్రంభీం ఆసిఫాబాద్కు కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నియమితులయ్యారు. కొత్త అధ్యక్షుల ఎంపికపై ఆయా జిల్లాల్లో నాయకులు, పార్టీ కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. అధ్యక్షులను పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తమపై నమ్మకంతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు కొత్త అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్త్తామని కొత్త అధ్యక్షులు తెలిపారు.
అందరి సహకారంతో తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తానని టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా కొత్త అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ‘నమస్తేతెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు మథోల్ నియోజకవర్గ, జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తారనన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. హైదారాబాద్కు వెళ్లి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పారు.