ఆదివాసుల అతిపెద్ద జాతరకు వేళయింది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయం ముస్తాబైంది. నేటి(శనివారం) అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభం కానుండగా, ఆద్యంతం వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. మెస్రం వంశీలయుతో పాటు అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేయగా, గిరిజన సంస్కతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ మహోత్సవం జరగనున్నది. పవిత్ర గంగాజలంతో ఆరాధ్య దైవాన్ని అభిషేకించనుండగా, ఆలయానికి భక్తజనం పోటెత్తనున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు తరలి రానుండగా, ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతున్నది.
ఇంద్రవెల్లి, జనవరి 20: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి ప్రారంభం కానుంది. యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. కాగా, ఈ వేడుకకు మెస్రం వంశీయులతో పాటు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని కలమడుగుకు కాలినడకన వెళ్లి గోదావరి పవిత్ర జలాలను తీసుకొచ్చారు. ఈ జలాలతో అభిషేకం చేసిన అనంతరం జాతర ప్రారంభమవుతుంది. అధికారికంగా ఐదు రోజులపాటు కొనసాగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, బిహార్, ఏపీ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. విదేశాల నుంచి పర్యాటకులు, సందర్శకులు తరలిరానున్నారు. శనివారం సాయంత్రం ఎడ్లబండ్లతో గోవాడ్కు మెస్రం వంశీయులు చేరుకుంటారు. రాత్రి నాగోబా ఆలయాన్ని పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి నాగోబాకు అభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించి మహాపూజలు నిర్వహిస్తారు. ఆలయంలో ఏడు రకాల పాముల పుట్టలను తయారు చేసి, వాటికి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతోపాటు ఆదివాసుల నమ్మకం.
క్రీ,శ 740లో కేస్లాపూర్ గ్రామ గిరిజనుడు పడియేరు శేషసాయి నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్తాడు. అక్కడ నాగరాజు లేకపోవడంతో నిరుత్సాహంతో శేషతల్పం తాకి కేస్లాపూర్కు వె నుదిరుగుతాడు. శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకొ ని నాగేంద్రుడు ఆగ్రహిస్తాడు. శేషసాయిని అంతమొందించేందుకు భూలోకానికి వస్తాడు. విషయం తెలుసుకున్న శేషసాయి ఏడు కడవల ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడు రకాల నైవేద్యం సమర్పిస్తాడు. గోదావరి హస్తలమడుగు నీటిని 125 గ్రామాల మీదుగా తీసుకొచ్చి నాగరాజును అభిషేకిస్తాడు. కేస్లాపూర్ వద్ద ఉన్న పుట్టలోకి నాగరాజు వెళ్లి అక్కడే తన నివాసంగా మార్చుకుంటాడు. అప్పటి నుంచి పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజలు నిర్వహిస్తున్నారు.
నాగోబా దేవతకు మెస్రం వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తారు. మెస్రం వంశంలో 22 తెగలు ఉన్నాయి. అందులో ఏడుగురు దేవతలను కొలిచేవారంతా మెస్రం వంశస్తులు. మడావి, మర్సుకోల, పుర్కా, మెస్రం, వెడ్మ, ఫంద్రా, ఉర్వేత, ఇలా ఇంటిపేర్లు గల వారంతా మెస్రం వంశంలోకి వస్తారు.
కాలం మారుతున్నా మెస్రం వంశీయులు తమ సంస్కృతిని వీడలేదు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరినదీ హస్తలమడుగు పవిత్ర గంగాజలాన్ని సేకరించడానికి 125 గ్రామాల మీదుగా 220 కిలోమీటర్లు కాలినడకన వెళ్తారు. అక్కడి నుంచి తెచ్చిన గంగజలంతోనే నాగోబాను అభిషేకిస్తారు. ముందుగా గంగాజలం ఝరిని మర్రిచెట్ల వద్ద మోదుగ చెట్టుపై నాలుగు రోజులు భద్రంగా ఉంచుతారు. గంగాజలానికి వెళ్లే ముందు 25 రోజుల నుంచే నాగోబాకు నిర్వహించే మహాపూజలపై మెస్రం వంశీయులు సంప్రదాయ పద్ధతిలో ఏర్పాట్లలో నిమగ్నమవుతారు.
జాతరకు వచ్చే మెస్రం వంశీయులకు చెందిన మహిళలు వంటలు చేసుకునేందుకు గోవాడలో 22 పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. మహాపూజలకు కావాల్సిన నైవేద్యాలు ఇక్కడే వండుతారు. గోవాడ్లో ఇతరులు రాకుండా నిబంధనలు విధిస్తారు. వందలాది మంది మెస్రం మహిళలు వంతుల వారీగా వంటలు చేస్తారు. ఇతరులు ఆలయ అవరణలో ఎక్కడైనా వంటలు చేసుకొని అక్కడే బస చేయవచ్చు.
యేటా నిర్వహించే దర్బార్కు ప్రత్యేక స్థానం ఉంది. 77 ఏళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరిగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరూ వెళ్లేవా రు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం, జల్జంగల్తోపాటు హక్కుల సాధన కోసం నైజాం ప్రభుత్వంతో కుమ్రం భీం పోరాటం చేశారు. ఆయన పోరాటాల ఫలితమే గిరిజనులకు హక్కులు దక్కా యి. అప్పుడు గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు మా నవ పరిణామ శాస్త్రవేత్త హైమన్డార్ఫ్ జిల్లాకు వచ్చారు. కేస్లాపూర్లో గిరిజనులంతా ఏకమై జాతర నిర్వహించే విషయాన్ని తెలుసుకున్న ఆయన దీన్ని వేదికగా ఎంచుకున్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు దర్బార్ ఏర్పాటు చేసి కూలంకుషంగా చర్చించారు. హై మన్డార్ఫ్ 1946లో మొదటి దర్బార్ను నాగోబా జాతరలో నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి యేటా ప్రజాదర్బార్ను గిరిజనులు నిర్వహిస్తున్నారు. ఈ దర్బార్ను ఐటీడీఏ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నారు.
శనివారం రాత్రి నిర్వహించే మహాపూజలతోపాటు, జాతరకు రావాలిని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్కు ఆహ్వాన పత్రిక అందించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం, మెస్రం వంశీయులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు సోనేరావ్, శేఖర్బాబు, నాగోరావ్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జనవరి 20 : జాతర సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి అర్జున్ ముండా 22న కేస్లాపూర్కు వస్తున్నట్లు ఎంపీ సోయం బాపురావ్ తెలిపారు. ఆలయంతోపాటు మర్రిచెట్ల ప్రాంతం, హెలీప్యాడ్ గ్రౌండ్ను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. అభివృద్ధికి కావాల్సిన పనులపై ప్రణాళిక చేయాలని మెస్రం వంశీయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, వంశీయులు బాజీరావ్పటేల్, జంగుపటేల్, నాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.