ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 97 పరీక్షా కేంద్రాల్లో 31,157 మంది విద్యార్థుల కోసం ఏర్పాట్లు చేయగా, 28,170 మంది హాజరయ్యారు. మొదటి రోజు 2987 మంది గైర్హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. కాగా, నేడు నిర్వహించనున్న సెకండియర్ పరీక్షకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
నిర్మల్ అర్బన్/ఆదిలాబాద్ టౌన్, మార్చి 15 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. సీసీ కెమెరాల నీడలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. నిర్మల్ జిల్లాలో ఫస్టియర్లో మొత్తం 7553 విద్యార్థులు ఉన్నారు. జనరల్ విభాగంలో 6276 మంది విద్యార్థులకు 5912 మంది హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1277 మంది విద్యార్థులకు 983 మంది హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ వరుణ్ రెడ్డి తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో వసతులను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఇదిలా ఉండగా గురువారం ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 7661 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఇందులో 6463 మంది రెగ్యులర్, వొకేషనల్ కోర్సుల్లో 1198 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని డీఐఈవో పరశురాం తెలిపారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని, నిమిషం నిబంధన అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. డీఐఈవో రవీందర్ కుమార్ పలు కేంద్రాలను సందర్శించి స్థానిక సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. తొలి రోజు 10,819 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 9366 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఇంటర్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహిం చాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కాగా, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ బాలికల కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. డీఐఈవో, సెంటర్ చీఫ్ సూపరిం టెండెంట్లతో కలిసి గదులను పరిశీలించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు జరుగకుండా చూడాలని సూచించారు. పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో సజావుగా పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఆయన వెంట జిల్లా డీఐఈవో సీ రవీందర్ కుమార్, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఐలయ్య ఉన్నారు.