మంచిర్యాలటౌన్/చెన్నూర్/ చెన్నూర్టౌన్/బెల్లంపలి/దండేపల్లి/కాసిపేట/దహెగాం/రెబ్బెన/బెజ్జూర్ ఫిబ్రవరి 24 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు నిర్వహణకు అన్ని మండలాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 16 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీటిలో 10 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 6 ప్రభుత్వ రంగ జూనియర్ కాలేజీలు, ఏడు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పరీక్షా కేంద్రాలు ఉన్న కాలేజీల్లో తరగతి గదుల వారీగా హాల్ టికెట్ నంబర్లను మంగళవారం లెక్చరర్లు టేబుళ్లపై రాసి ఉంచారు.
మంచిర్యాలలోని పరీక్షా కేంద్రాన్ని డీఐఈఓ అంజయ్య, పరీక్షల విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో మొత్తం 12317 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా వారిలో ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసేవారు 6260 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు 6057 మంది ఉన్నారు. 46 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, నలుగురు కస్టోడియన్లు, రెండు సిట్టింగ్ స్కాడ్ టీంలు, ఒక ఫ్లయింగ్ స్కాడ్ టీం ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయి. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జీరాక్స్ కేంద్రాలను మూసి ఉంచేలా చర్యలు చేపట్టారు.