మంచిర్యాలటౌన్/ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 25 : మంచిర్యాల జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగాయి. సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షకు జనరల్ విద్యార్థులు 5776, వొకేషనల్ విద్యార్థులు 912 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, ఇందులో జనరల్ విద్యార్థులు 5603, వొకేషనల్ విద్యార్థులు 856 మంది హాజరయ్యారు. మొత్తం 96.50 శాతం మంది హాజరైనట్లు జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్, డీఐఈవో అంజయ్య తెలిపారు.
కాగా, మంచిర్యాలలోని అల్ఫోర్స్, వేంపల్లిలోని ఎస్ఆర్ఆర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలను నిర్వహించాలని, కాపీయింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని డీవో, సీఎస్లకు సూచించారు. జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఫ్లయింగ్ స్కాడ్, సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా సమయంలో 163-బీఎన్ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందని, కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. జవాబు పత్రాలను సురక్షితంగా రవాణా చేయడం కోసం తపాలాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆయన వెంట డీఐఈవో అంజయ్య, హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్రావు దేశ్పాండే ఉన్నారు.
ఆసిఫాబాద్లో..
ఇంటర్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ఖ జిల్లా కేంద్రంలోని టీజీటీడబ్ల్యూఆర్జేసీ బాలికల, పీటీజీ బాలుర జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలని, ప్రశ్నాపత్రాల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, విద్యార్థుల హాజరు శాతం, హాల్ టికెట్ల తనిఖీ తదితర అంశాలను పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆయా సెంటర్ల సీఎస్, డీవోలు సునీల్, శంకరయ్య పాల్గొన్నారు.
మొదటి రోజు ప్రశాంతం
జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 5211 మంది విద్యార్థులకుగాను, 5039 మంది హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రాందాస్ తెలిపారు. జనరల్లో 4438 మందికి 4316 మంది, ఒకేషనల్లో 773 మందికిగాను, 723 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.