రైతన్నలు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం సాగులో సమూల మార్పులు తీసుకొస్తున్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహిస్తున్నది. అన్నదాతలకు కావాల్సిన పెట్టుబడి సాయం, సబ్సిడీపై పరికరాలు, మొక్కలు, ఎరువులు అందిస్తూ దన్నుగా నిలుస్తున్నది. కర్షకులు ఢోకా లేకుండా సాగు వైపు ఆనందంగా కదులున్నారు. డబుల్ ఆదాయం వస్తున్న ఆయిల్ పామ్, అంతర సాగుపై మొగ్గు చూపుతున్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పరిమండల్ గ్రామానికి చెందిన మేకల మల్లయ్య, నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామానికి చెందిన గజ్జెల మల్లు ఆయిల్ పామ్ తోటల్లో అంతర సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
– నిర్మల్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ)
నిర్మల్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం 8,420 ఎకరాలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 5,348 ఎకరాల్లో సాగు చేసేందుకు 2,028 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 1,131 మంది రైతులు 3,166 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలు వేస్తే ఎకరానికి రూ.4వేల ప్రోత్సాహకాన్ని ఇస్తున్నది. దీనిని సద్వినియోగం చేసుకుంటున్న కొందరు రైతులు ఆదాయాన్ని గడిస్తున్నారు. ఆయిల్ పామ్ మొక్కలను మూడేళ్లపాటు పెంచితే ఆ తర్వాత 40 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇలా అంతర సాగుతో రైతులు డబుల్ ఆదాయాన్ని పొందుతున్నారు. మామడ మండలంలోని పరిమండల్ గ్రామానికి చెందిన మేకల మల్లయ్య, నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామానికి చెందిన గజ్జెల మల్లు ఆయిల్ పామ్ తోటల్లో అంతర సాగు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పదెకరాల్లో ఆయిల్ పామ్..
నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామానికి చెందిన మల్లు తనకున్న 20 ఎకరాల్లో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నాడు. వ్యవసాయాధికారులు అవగాహన కల్పించడంతో గతేడాది జూన్లో పదెకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటాడు. ఎకరానికి 50 చొప్పున 500 మొక్కలు నాటాడు. సాగునీరు, ఎరువులను అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఆయిల్ పామ్ తోటలో వానకాలంలో అంతర పంటలు వేసి ఆదాయాన్ని కూడా పొందాడు.
ఐదెకరాల్లో పసుపు పంట వేయగా.. 38 ట్రాక్టర్ల దిగుబడి వచ్చిందని సంతోషంగా చెబుతున్నాడు. అలాగే ఒక ఎకరంలో వంకాయ, రెండెకరాల్లో పత్తి, మరో రెండెకరాల్లో సోయా వేశాడు. ఆయిల్ పామ్ సాగు చేస్తే నాలుగేళ్ల వరకు ఆదాయం ఉండదని, చాలా మంది రైతులు సాగుకు వెనకడుగు వేస్తున్నారు. దీనిని పటాపంచలు చేస్తూ గజ్జెల మల్లు-శంకరవ్వ దంపతులు అంతర పంటలు వేసి చూపించారు. ప్రస్తుతం రెండో పంటగా మిర్చి, క్యాబేజీ, వంకాయ, టమాట వంటి కూరగాయలలతోపాటు ఆవాలు, నువ్వులు, మక్క వేయగా.. అవి చివరి దశలో ఉన్నాయి. అరెకరంలో వేసిన క్యాబేజీతో 15 రోజుల్లోనే రూ.42 వేలు, ఎకరంలో వేసిన వంకాయతో మూడు నెలల్లోనే రూ.2.50 లక్షలు వచ్చాయని తెలిపాడు. కాలానికి అనుగుణంగా కొత్త ప్రయోగాలు చేస్తేనే అధిక లాభాలు పొందవచ్చని సూచిస్తున్నాడు.
యూట్యూబ్లో చూసి..
మామడ మండలం పరిమండల్కు చెందిన మేకల మల్లయ్యకు గ్రామ శివారులో ఎనిమిదెకరాల భూమి ఉంది. మల్లయ్య కొడుకు సతీష్ డిగ్రీ వరకు చదువుకొని తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయంగా ఉంటున్నాడు. ఒకసారి సతీష్ యూట్యూబ్లో ఆయిల్ పామ్ సాగు గురించి, దీర్ఘకాలంలో వచ్చే ఆదాయం గురించి చూశాడు. ఈ విషయాన్ని తండ్రి మల్లయ్యకు చెప్పి మూడెకరాల్లో సాగుకు ఒప్పించాడు. వ్యవసాయాధికారులను సంప్రదించడంతో నయా పైసా ఖర్చు లేకుండా డ్రిప్ సిస్టంను ఏర్పాటు చేశారు. రూ.193 సబ్సిడీ అందజేస్తూ కేవలం రూ.20 లకు ఒక మొక్క చొప్పున మూడెకరాలకు 150 మొక్కలను అందజేశారు. గత అక్టోబర్లో మొక్కలను నాటిన మల్లయ్య వెనువెంటనే అంతర పంటగా మక్క వేశాడు. ప్రస్తుతం ఏపుగా పెరిగి కొతకు వచ్చిందని చెబుతున్నాడు. అంతర పంట వేసినందుకు ఎకరానికి రూ.4200 చొప్పున రూ.12,600లు నా ఖాతాలో జమ అయ్యాయని, వీటిని ఎరువుల కోసం వినియోగించానని మల్లయ్య సంతోషంగా చెబుతున్నాడు. మక్క ద్వారా ఎకరానికి రూ.85 నుంచి రూ.90 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నాడు.
ఎకరానికి రూ.4200
ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులకు నాలు గేండ్ల్ల వరకు ఎలాంటి ఆదాయం రాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎకరానికి రూ.4200 ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నది. వీటిలో రూ.2100 ఎరువులు, మరో రూ.2100 ఇతర ఖర్చుల కోసం ఇస్తున్నది. అయితే ఆయిల్ పామ్ మొక్కలకు వేసే ఎరువుల వల్ల భూసారం పెరుగుతుం ది. దీంతో అంతర పంటలు వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. తక్కువ పెట్టుబడి ఖర్చుతో అధిక ఆదాయం పొందే వీలుంటుంది. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు అన్ని రకాల అంతర పంటలను వేసుకోవచ్చు.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, నిర్మల్