Sobhita Dhulipala | అక్కినేని కుటుంబ కోడలు, ప్రముఖ నటి శోభిత ధూళిపాళ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి కారణం ఆమె కొత్త సినిమా కాదు.. గతంలో రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో శోభిత వ్యక్తం చేసిన కామెంట్స్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం మళ్లీ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత ధూళిపాళ తన రాజకీయ ఆలోచనల గురించి మాట్లాడుతూ… నాకు వామపక్ష భావజాలం ఎక్కువ. భవిష్యత్తులో ఏదో ఒక రోజు కమ్యూనిజమే గెలుస్తుంది అని వ్యాఖ్యానించారు.
ఆ సమయంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పెద్దగా చర్చకు రాకపోయినా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో మళ్లీ వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. వీడియో వైరల్ కావడంతో కొంతమంది నెటిజన్లు శోభిత వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. గ్లామర్ రంగంలో విజయవంతమైన కెరీర్తో పాటు లగ్జరీ జీవితాన్ని గడుపుతూ కమ్యూనిజం గురించి మాట్లాడటం విరుద్ధంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే, కమ్యూనిస్టు భావజాలంపై నమ్మకం ఉంటే ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించాలని, కేవలం వ్యాఖ్యలు చేయడం సరిపోదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు శోభితకు మద్దతుగా కూడా పలువురు స్పందిస్తున్నారు. ఒక వ్యక్తి తన వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో సహజమేనని, పాత ఇంటర్వ్యూను ఇప్పుడు బయటకు తీసి విమర్శించడం సరైన విధానం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. శోభిత ఎలాంటి భయం లేకుండా తన అభిప్రాయాన్ని వెల్లడించారని, దానిని వ్యక్తిగత దూషణలకు కారణంగా మార్చకూడదని కూడా కొందరు సోషల్ మీడియా వినియోగదారులు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ, శోభిత ధూళిపాల ఇప్పటివరకు ఈ ట్రోలింగ్పై స్పందించలేదు. మరి ఆమె ఈ వివాదంపై స్పందిస్తారా? లేదా మౌనం పాటిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.