మంచిర్యాల, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్కు కూతవేటు దూరంలో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 42లోగల 8 గుంటల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ భూమిలో దర్జాగా కట్టడాలు చేపడుతుండగా, అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గత కేసీఆర్ సర్కారు ఇక్కడ నిర్మించిన షెడ్లను రెండుసార్లు కూల్చివేయగా, అలా కాంగ్రెస్ గెలిచిందో లేదో.. తిరిగి అదే భూమిలో కట్టడాలు ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
నస్పూర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో సర్వే నంబర్ 42లో ఎలాంటి ఇండ్లు లేవు. కానీ, ఉన్నట్లుగా ఇంటినంబర్లు సంపాదించారు. అలా ఇంటి నంబర్లు ఉన్నాయని చెప్పి నిర్మాణాలు చేపట్టేందుకు కొందరు అక్రమార్కులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి ఇప్పుడు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారో అక్కడున్న 12 గుంటల భూమిని అప్పటి ప్రభుత్వం మిషన్ భగీరథ కోసం కేటాయించింది. అది పక్కా ప్రభుత్వ భూమి, పైగా మిషన్ భగీరథ కోసం కేటాయించిన భూమి, ఇందులో నిర్మాణాలు ఎలా చేపడుతారంటూ గతంలో అధికారులు అక్రమ నిర్మాణాలు, కంచెలను తొలగించుకుంటూ వచ్చారు.
ఇలా 2021 ఏప్రిల్లో ఒకసారి, 2023లో మరోసారి నిర్మాణాలను కూల్చివేశారు. కానీ, డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలైపోగానే అక్రమ నిర్మాణాలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో అప్పుడు ప్రభుత్వనిదైనా ఈ భూమి ఇప్పుడు కాకుండా పోయిందా అని స్థానికులు నిలదీస్తున్నారు. ఇండ్లు కట్టుకుంటూ పోతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఎమ్మార్వో,, మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్లను కలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే భూమిలో గతంలో చేపట్టిన నిర్మాణాలను కూల్చినప్పుడు సదరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై అప్పుడు నస్పూర్ ఎమ్మార్వోగా ఉన్న జ్యోతి అసలు అక్కడ ఎలాంటి నిర్మాణాలు, షెడ్లు లేవని, వీళ్లకు ఇంటి నంబర్లు ఇచ్చినట్లు కూడా లేదని రిట్ పిటిషన్ వేశారు. అప్పటి నుంచి ఈ విషయం కోర్టులోనే ఉంది. కానీ ఎలాగైనా భూమిని దక్కించుకోవాలనే అక్కసుతో నస్పూర్ మున్సిపాలిటీగా ఏర్పాటయ్యాక ఆ ఇంటి నంబర్లతో ఆన్లైన్లో ట్యాక్స్ కట్టడం మొదలుపెట్టారు.
దీన్ని గుర్తించిన అప్పటి మున్సిపల్ కమిషనర్ నవంబర్ 11, 2023లో పన్నులు కట్టిన ఆరు ఇంటి నంబర్ల(5-100087, 5-100093, 5-100094, 1-100090, 5-100091, 5-100095)లో ఓపెన్ ప్లాట్లున్నాయని, అందుకని ఈ ఆరు అసెస్మెంట్స్ని సీడీడీ ఆన్లైన్ వెబ్సైట్ నుంచి తొలిగించామని నస్పూర్ తహసీల్దార్కే లేఖ రాశారు. ఆన్లైన్లో కట్టిన ట్యాక్స్ను రద్దు చేసినట్లు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో ఇంత చేసిన అధికారులు.. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది.
కాగా అధికారుల నిర్లక్ష్యం తమకు కలిసి వచ్చేలా అక్రమార్కులు పక్కాగా ప్లానింగ్ చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. తమకు కోర్టు ఆర్డర్ ఉందని చెప్తూ ఆరు ఇండ్లు కట్టేశారు. అంతేగాకుండా రాత్రికిరాత్రే బోర్వెల్ వేశారు. సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు అధికారులు వచ్చి ఆ నిర్మాణాలను కూలిస్తే ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అవుతాయి. అప్పుడు ఉన్న ఇండ్లను కూల్చి అసలు అక్కడ ఏం నిర్మాణాలు లేవని అధికారులు చెప్తున్నారని కోర్టుకు ఆధారాలు చూపించేందుకు ఈ ప్లాన్ చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఒకవేళ నిజంగానే కోర్టు ఆర్డర్ ఉంటే నిర్మాణాలకు డైరెక్షన్ ఇచ్చే అవకాశమైతే లేదు. మరి ఎందుకు అధికారులు నిర్మాణాలు జరుగుతున్నప్పుడే అడ్డుకోవడం లేదో అంతుపట్టడం లేదు. ఈ స్థలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పక్కనే ఉండగా, కావాలనే కొందరు వెనుకుండి ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు స్పంచింది ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.