మంచిర్యాల, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ సీజన్లో నకిలీ విత్తనాలు మార్కెట్ను ముంచెత్తనున్నాయా.. అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యేటా కొందరు వ్యాపారులు మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వేలాది క్వింటాళ్ల నకిలీ విత్తనాలు తీసుకొచ్చి.. విచ్చల విడిగా విక్రయిస్తుండగా, ఈసారి కూడా అమ్మకాలకు అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతుందన్న ఆరోపణలున్నాయి. వ్యాపారులు వ్యవసాయశాఖలోని జిల్లా స్థాయి అధికారులు మొదలు.. మండల స్థాయి అధికారుల దాకా రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ముందే మామూళ్లు ముట్టజెప్పుతారని తెలిసింది. ఇక పోలీసులకూ అదే స్థాయిలో డబ్బులు అందుతాయన్న ప్రచారముంది.
ఈ సీజన్లో ఇప్పటికే కొన్ని మండలాల అధికారులకు లంచాలు ముట్టాయని ఈ దందాలో కీలకంగా వ్యవహరించే ఓ వ్యక్తి బహిరంగంగానే చెప్పడం గమనార్హం. కేవలం మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ప్రాంతాల్లోని అధికారులకు దాదాపు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల దాకా కేటాయిస్తారంటూ తాను చెప్పిన మాటలు బట్టి చూస్తే.. ఈ దందా ఎంత పెద్ద మొత్తంలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ైగ్లెసిల్ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తున్న తీరుపై ‘నమస్తే తెలంగాణ’లో సీజన్కు ముందే నకిలీ దందా శీర్షికన కథనం ప్రచురితమైంది.
పోలీసుల సహకారంతో 20 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు మాయమైనట్లు, ఇందులో ఓ పోలీసు అధికారికి ఆమ్యామ్యాలు ముట్టినట్లు, ఓ కాంగ్రెస్ లీడర్ సెటిల్మెంట్ చేసినట్లు వచ్చిన కథనంపై బెల్లంపల్లి, మంచిర్యాలలో విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర ఏమిటి, విత్తనాలు ఎక్కడికి తరలించారు, ఎక్కడ డంప్ చేశారు, సెటిల్మెంట్ చేసిన సదరు కాంగ్రెస్ లీడర్ ఎవరు.. విత్తనాల షాపుల యాజమానులను ఎందుకు అన్ని కోట్ల రూపాయాలు అడిగారు.. ఇలా అన్ని అంశాలపై ఆరా తీసిన అధికారులు నివేదికను ఉన్నతస్థాయి అధికారులకు పంపినట్లు తెలిసింది. ఈ మేరకు విత్తనాలు డంప్ చేసిన ప్రాంతాలను సైతం ఈ అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.
నకిలీ విత్తనాలు సరఫరా చేసే ఆంధ్రా వ్యక్తి (దందా మొత్తానికి బాస్) ఇప్పటికే చెన్నూర్, మంచిర్యాలలో మకాం వేసినట్లు తెలిసింది. ఈ రెండు ప్రాంతాల్లోని లాడ్జిలలో ఉంటూ.. రోజుకో ప్లేస్ మారుస్తూ చేప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. చెన్నూర్ కేంద్రంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు సైతం ఈ ైగ్లెసిస్ విత్తనాలను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. విత్తన షాపుల యాజమానుల నుంచి ఆర్డర్లు తీసుకొని, డబ్బులు వసూలు చేసుకుంటున్నట్లు తెలిసింది. కానీ, ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంతో కాస్త వెనుకడగు వేసినట్లు విశ్వసనీయ సమాచారం.
బెల్లంపల్లి కేంద్రంలోని వ్యాపారుల నుంచి దాదాపు రూ.3 కోట్ల డీల్ను సైతం ప్రస్తుతం పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది. వచ్చిన ఆర్డర్లను అనుసరించి ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్(సామగ్రి ట్రాన్స్పోర్ట్ చేసే సంస్థల) ద్వారా విత్తనాలను మంచిర్యాల, చెన్నూర్లకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్తో పాటు కోటపల్లి, వేమనపల్లి, కన్నేపల్లి, భీమిని, నెన్నెల, భీమారం, తాండూర్ మండలాలతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన, దహెగాం, కాగజ్నగర్, బెజ్జూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో విత్తనాలు సరఫరా చేసేందుకు డంప్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.
నకిలీ విత్తనాల దందాను అరికట్టేందుకు జిల్లాలో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. కేసీఆర్ సర్కారులో సీజన్కు ముందే ఈ కమిటీలను వేసేవారు. జిల్లా వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండి.. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. గతంలో మంచిర్యాల జిల్లాలోని గద్దెరాగడి ప్రాంతంలో భారీ మొత్తంలో నకిలీ విత్తనాలను పట్టుకుంది కూడా టాస్క్ఫోర్స్ కమిటీనే. అలా మంచిర్యాల జిల్లా ఏర్పాటయ్యాక గడిచిన ఐదేళ్లలో రూ.4.31 కోట్లు విలువైన నకిలీ విత్తనాలను సీజ్ చేసి, 221 మందిని కటకటాల్లోకి పంపారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నకిలీ విత్తనాల మాఫియా ఆగడం లేదు.
జిల్లాలో ఇప్పటి వరకు టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం, నకిలీ విత్తనాలు జిల్లాలోకి వచ్చాయనే సమాచారం ఉండి కూడా ఒక్క కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పైగా ైగ్లెసిస్ విత్తనాలను వాడితే కలిగే నష్టంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. గతంలో మాదిరిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. జిల్లాస్థాయి వ్యవసాయ అధికారి అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడంతోనే క్షేత్రస్థాయిలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారినట్లు తెలుస్తున్నది.
ఇటీవల యూరియా ఇండెట్ల కేటాయింపు అక్రమాల్లోనూ విచారణ జరిపిన అధికారులు, ఈ విషయాన్ని గుర్తించి, వ్యవసాయ శాఖ కమిషనర్కు విన్నవించినట్లు సమాచారం. కానీ జిల్లా స్థాయిలో అధికారులను వదిలేసి కేవలం చెన్నూర్ అధికారులనే సస్పెండ్ చేయడం కూడా పలు అనుమానాలను తావిస్తున్నది. ఒక నెల మొత్తం విధులకు రాకుండా వచ్చినట్లు సంతకాలు పెట్టి వేతనం తీసుకున్న జిల్లా స్థాయిలోని ఓ కీలక అధికారి సస్పెన్షన్ కావాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో ఉన్నతాధికారులు నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తుంది. అధికారుల తీరు ఇలా ఉండడం వల్లే వ్యవసాయ శాఖలో అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకొని వేల కోట్ల నకిలీ విత్తన దందాను అరికట్టడంపై దృష్టి సారిస్తారా.. లేదా అన్నది తేలాల్సి ఉంది.