భైంసా, మార్చి 10: భైంసాలో పరిస్థితి పూర్తి అదుపులో ఉందని ఐజీ నాగిరెడ్డి అన్నారు. పట్టణంలో అల్లర్లు జరిగిన ప్రదేశాన్ని ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
భైంసాలో పరిస్థితి పూర్తి అదుపులోనే ఉందని ఐజీ నాగిరెడ్డి అన్నారు. అల్లర్లు జరిగిన ప్రదేశాన్ని ఐజీ బుధవారం సందర్శించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మేక విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం ఇరువర్గాలకు పాకినట్లు పేర్కొన్నారు. ఆ వెంటనే రాళ్లు రువ్వుకోవడం మొదలైందని చెప్పారు. ఈ ఘటనలో 19 కేసులు నమోదు చేసి, 22 మందిని అరెస్టు చేశామని, ఇందులో ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నట్లు చెప్పారు. ఇంకా 25 మందిని అనుమానితులుగా గుర్తించామన్నారు. వీరిని సీసీ టీవీ, లోకల్ వీడియోస్ ద్వారా పరిశీలనలో ఉంచినట్లు తెలిపారు. గంటన్నరలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చామన్నారు. ఎస్పీ విష్ణు వారియర్, ఓఎస్డీ పవార్, రామగుండం సీపీ సత్యనారాయణ, అడిషనల్ ఎస్పీ రాజేశ్ వెంటనే రంగంలోకి దిగి, పరిస్థితిని సమీక్షించారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్తామన్నారు. భవిష్యత్లో పెద్ద సంఖ్యలో బలగాలను భైంసాలో అందుబాటులో ఉంచే విషయంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయిస్తామన్నారు. ఎస్పీ విష్ణు వారియర్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో పాటు కానిస్టేబుల్ రమణయ్యను ఐజీ అభినందించారు. ఈయన వెంట ఎస్పీ విష్ణు వారియర్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న 144 సెక్షన్..
భైంసాలో 144 సెక్షన్ కొనసాగుతున్నది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేసి పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ భైంసాలోనే మకాం వేశారు.