ఆదిలాబాద్ పట్టణంలోని ఆరో వార్డులో గల కుమ్మరికుంట యేటా వానకాలంలో పొంగి ప్రవహిస్తున్నది. కాలువ, మత్తడి ప్రాంతాలు అక్రమణకు గురికావడంతో ఇండ్ల మధ్య నుంచే వాననీరు నడుం లోతుకుపైగా ప్రవాహం కొనసాగుతున్నది. గతేడాది ఆగస్టు 16వ తేదీన కురిసిన వర్షాలతో పలు ఇండ్లలోకి నీరు ప్రవేశించగా ఒక ఇల్లు కూలింది. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కుంటలో నీరు తమ ఇండ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కుంటలోని నీరు ఇండ్ల ఎదుట నుంచి ప్రవహించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడుతున్నామని అధికారులకు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఆరు నెలలు గడిచినా చర్యలు లేవు.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు వర్షం పడితే జలమయం అవుతున్నాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతోపాటు ఇండ్లలోకి నీరు చేరుతున్నది. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రజ లు భయపడుతారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో బాగు చేయ డానికి ప్రతిపాదనలు తయారు చేయగా.. అంతలోనే అసెంబ్లీ ఎ న్నికలు రావడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు 16న కురిసిన భారీ వర్షాల కారణంగా పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి.
కుండపోత వర్షం కారణంగా వాగులు, కుంటలు, నాలాలు పొంగి ప్రవహించడంతో కాలనీల్లో నీరు చేరగా, ఇండ్లకు నష్టం వాటిల్లింది. కాలనీల్లో ఇళ్లు కూలాయి. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా వరద నీరు ప్రవహించడంపై కారణాల తెలియజేస్తూ సమగ్ర నివేదికలు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల అధికారుతోపాటు ప్రత్యేకాధికారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సర్వే చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డులు ఉండగా 15 వార్డుల్లో వరదల ప్రభావం ఉందని, 254 ఇండ్లు వరద ప్రవాహానికి గురయ్యాయని సర్వేలో నిర్ధారించారు.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లోని కుంటలు, వాగులు, నాలాల అక్రమణలతో వర్షం నీరు బయటకు పోవడానికి అవకాశం లేకపోవడంతోపాటు చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉండడం వల్ల వరద నీరు ఇండ్లలోకి ప్రవేశిస్తున్నదని అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. ఇందుకోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు కలెక్టర్కు వివరించారు. చెరువులు, కుంటల నీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, అక్రమణలు తొలగించాలని సూచించారు. పలు వార్డుల్లో మురుగు కాల్వలు నిర్మించడంతోపాటు నాలాలు వెడల్పు చేయాల్సిని సూచించారు.
ఎక్కువగా ప్రభావతమైన వార్డు నంబరు 3 లోని జీఎస్ ఎస్టేట్లోకి నీరు రాకుండా రిటేయినింగ్ గోడ నిర్మించాలని సూచించారు. వర్షకాలంలో కాలనీలవాసులు ఇబ్బందులు పడకుండా రూ.50 కోట్లతో వివిధ పనులు చేపట్టాలని నివేదికలు తయారు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతిపాదనలు మంజూరు కోసం ప్రభుత్వానికి పంపించినా ఫలితం లేదు. ఆరు నెలలు దాటిన మంజూరు లభించకపోగా.. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీవాసులు వర్షకాలంలో తిరిగి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి.