రామకృష్ణాపూర్, నవంబర్ 13 : మారానని.. మంచిగ చూసుకుంటాననిపుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చిన రెండు రోజులకే గంగాకాలనీకి చెందిన మాటూరి లక్ష్మీనారాయణ (43) తన భార్య నాగలక్ష్మి (37)ని హత్య చేసి రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ అశోక్ తెలిపారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలిపారు. మృతురాలి తండ్రి గంగారపు కొమురయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన తన కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నేండ్లుగా హైదరాబాద్లోని సనత్నగర్లో ఉంటున్నది. తన పెద్ద కూతురు నాగలక్ష్మిని రామకృష్ణాపూర్లోని పోచమ బస్తీకి చెందిన మాటూరి దుర్గయ్య కొడుకు లక్ష్మీనారాయణ కు 20 ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు వివేక్ (17), కుమార్తె నవ్య (15) ఉన్నారు. భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో లక్ష్మీనారాయణ తన కూతురును మాసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నాడు. దీనికితోడు అదనపు కట్నం తేవాలని, పెండ్లిలో పెట్టిన బంగారం విక్రయించి ఏ పని చేయకుండా వేధిస్తున్నాడు. దీంతో పలుమార్లు లక్ష్మీనారాయణను మందిలించారు. అయినా మారకపోవడంతో భర్త బాధ భరించలేక ఈ ఏడాది జనవరి నుంచి నాగలక్ష్మి మాతోనే ఉంటుంది.
నవంబర్ 3న అతని బావ కలువల శ్రీనివాస్ను తీసుకొని తమ ఇంటికి వచ్చి భార్యను పంపించాలని, ఇకనుంచి మంచిగా చూసుకుంటానని కోరాడు. దీంతో ఈ నెల 10 న తన కూతురును రామకృష్ణాపూర్లోని గంగాకాలనీకి తీసుకువచ్చారు. శనివారం తన అల్లుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని అతని బావ శ్రీనివాస్ ద్వారా తెలిసింది. దీంతో అనుమానం వచ్చి తన కూతురు కోసం తెలుసుకునే ప్రయత్నం చేయగా సమాచారం తెలియలేదు. దీంతో అనుమానం వచ్చి డయల్ 100 కు ఫోన్ చేసి ఇంటి అడ్రస్ తెలిపారు. పోలీసులు వెళ్లి తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నది. ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. తన కూతురు హత్యకు కలువల శ్రీనివాస్, మాటూరి వివేక్, మాటూరి లక్ష్మీనారాయణ, అతని తండ్రి దుర్గయ్యపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.