ఎదులాపురం, జనవరి 13 : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బీసీ ఆత్మగౌరవానికి పెద్దపీట వేసినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్లో రూ.10లక్షలతో నిర్మించిన కురుమ సంఘం నూతన భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంఘం నాయకులు, కులస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థికంగా, రాజకీయంగా, కురుమల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. గురుకులాలతో పాటు, బీసీ రుణాలు, చట్ట సభల్లో కూడా బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్ భరత్, సంఘం జిల్లా అధ్యక్షుడు బింగి పోతన్న, ప్రధాన కార్యదర్శి కేమ రాజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి అయిల్ల పోచన్న, పోశెట్టి రాజన్న, నాయకులు దమ్మపాల్, రామ్ కుమార్, కేమశ్రీకాంత్, శ్రీనివాస్, బీ మమత తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో భారీగా చేరికలు..
స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసి కార్యక్రమంలో 100 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షుడు పెంట వెంకన్న, ఇందిరమ్మ కాలనీకి చెందిన శంకరయ్య ఆధ్వర్యంలో యువకులు, నాయకులకు ఎమ్మెల్యే రామన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదేండ్లలో లక్షల కోట్లు అప్పుగా తెచ్చారని, అయినా దేశ ప్రజానీకానికి చేసిందేమీలేదని దుయ్యబట్టారు. కేవలం దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ నేతలకు తగిన బుద్దిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నరు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఆత్మ డివిజన్ చైర్మన్ జిట్ట రమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేశ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అలాల్ అజయ్, కౌన్సిలర్ పవన్ నాయక్, మిషు, పండ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
భుక్తాపూర్లో పార్కు ప్రారంభం..
పట్టణంలోని భుక్తాపూర్లో రూ.30లక్షలతో అభివృద్ధి చేసిన పార్కును మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఎమ్మెల్యే రామన్న ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆట వస్తువులను పరిశీలించారు. కాసేపు చిన్నారులతో కలిసి ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజానీకానికి అన్ని వసతులు కల్పించేలా విస్తృత అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా పార్కులు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, డీఈ తిరుపతి, కౌన్సిలర్లు బండారి సతీశ్, అశోక్ స్వామి, నాయకులు కళ్లావిఠల్, కొండ గణేశ్, ఇబ్రహీం, సునీల్, సలీం తదితరులు పాల్గొన్నారు.