ఇంద్రవెల్లి, జనవరి 27 : ఆదివాసుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు. దుకాణాలతో పాటు రంగుల రాట్నాల వద్ద భక్తుల సందడి కనిపించింది. నాగోబా ఆలయ అభివృద్ధి కోసం మెస్రం వంశీయుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విరాళాలను సేకరించారు. నాగోబా ప్రాంగణంలో రెండు 108 అంబులెన్స్లను అధికారులు అందుబాటులో ఉంచారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్గఢ్కు చెందిన ధనారాం గాంధీజీ వేషధారణలో ఆకట్టుకున్నాడు. భక్తులు ఆసక్తిగా చూస్తూ, ఆయనతో సెల్ఫీలు దిగారు. ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రునాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ నాగోబాను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం, మెస్రం ఉద్యోగుల సంఘం కమిటీ సభ్యుడు మెస్రం శేఖర్బాబు ఆధ్వర్యంలో వారిని శాలువాతో సన్మానించారు. అనంతరం నాగోబా ఫొటోను బహూకరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వారికి వినతిపత్రం అందజేశారు. ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, జీసీసీ జీఎం సీతారాంనాయక్, ట్రైకార్ జీఎం కే శంకర్, ఐటీడీఏ ఏవో రాంబాబు, మెస్రం వంశీయులు పాల్గొన్నారు.