నిర్మల్ టౌన్, ఆగస్టు 29 : నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 52 డిజిటల్ వాటర్ మీటర్లలో ప్రతినెలా భూగర్భజలాల లెక్కింపు కార్యక్రమాన్ని భూగర్భ జలశాఖ నిర్వహిస్తుండగా.. జూలై మాసానికి సంబంధించిన భూగర్భజలాల లెక్కింపును అధికారులు ప్రకటించారు. జూన్ మాసంలో సమృద్ధిగా వర్షాలు కురవనప్పటికీ జూలై, ఆగస్టు నెలల్లో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురవడమే భూగర్భజలాల పెరుగుదలకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో మే నెలలో జిల్లా సరాసరి భూగర్భజలాలు 9.32 ఉండగా.. జూలై నాటికి 4.68 కి చేరుకుందని జిల్లా భూగర్భ జలశాఖ అధికారి శ్రీనివాస్బాబు తెలిపారు. జిల్లాలో 4.64 మీటర్ల నీటివృద్ధి పెరగడం జిల్లా రైతులకు సాగు నీటి వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు.
అన్ని ప్రాంతాల్లో పెరుగుదల
నిర్మల్ జిల్లాలోని భూగర్భ జలశాఖ ఏర్పాటు చేసిన డిజిటల్ మీటర్ వాటర్ లెవల్ కేంద్రాల్లో భూగర్భజలాల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు ప్రతినెల నిర్వహిస్తారు. జిల్లాలోని 19 మండలాల పరిధిలో 52 డిజిటల్ మీటర్లు ఉండగా.. నిర్మల్ జిల్లాలోని బోసిలో అత్యధికంగా 20.68 మీటర్ల భూగర్భజలాలు వృద్ధి చెందాయి. రాజూరాలో 10.53, అల్లంపల్లిలో 16.67 మీటర్ల భూగర్భజలం పెరిగినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అన్ని మండలాల్లో సగటున రెండు మీటర్ల నుంచి నాలుగు మీటర్ల వరకు పెరగడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈనెలలో కూడా భూగర్భజలాల స్థిరీకరణ ఇదే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శ్రీరాంసాగర్, కడెం, స్వర్ణవాగు, గడ్డెన్నవాగు, సదర్మాట్ ప్రాజెక్టులు నిండుకోవడమే కాకుండా నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో 645 చెరువులతోపాటు చెక్డ్యాంల్లో నీరు నిల్వ ఉండడం వల్ల భూగర్భజలాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
సాగు, తాగు నీటికి ఢోకా లేదు..
నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో రెండుమూడేళ్లపాటు నీటి కొరత ఉండదని భూగర్భ జలశాఖాధికారులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా 63,400 వ్యవసాయ పంపుసెట్ల ద్వారా సుమారు 2.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం భూగర్భజలాలు 4 మీటర్లు పెరగడంతో రైతుల సాగుకు, తాగుకు ఇబ్బంది ఉండదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వరినాట్లు వర్షం ఆధారంగానే పూర్తి కావడంతో భూగర్భజలాల వినియోగం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భూగర్భజలాలు పెరిగినప్పటికీ వాటిని సంరక్షించుకునేందుకు ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా అధికారి శ్రీనివాస్బాబు వివరించారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకొని వర్షపునీటిని భూమిలో ఇంకేటట్లు చూసుకుంటే భూగర్భజలాలు సంరక్షించుకోవచ్చని.. ఈ దిశగా ప్రజలకు భూగర్భజలశాఖ చైతన్యం చేస్తుందన్నారు.