నిర్మల్ టౌన్, జూలై 19 : నిర్మల్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణశాఖ సూచించినందున జిల్లా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లోని కలెక్టర్ కార్యాలయంలో ఆయా మండలాల అధికారులతో బుధవారం మాట్లాడారు. వర్షాలతో జరిగే నష్టాన్ని నివారించేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వాతావరణశాఖ నిర్మల్ జిల్లాను రెడ్జోన్గా ప్రకటించిందని గుర్తుచేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రజలు వరద తాకిడికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వాగులు, కల్వర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని, అధికారులు ముందస్తు అనుమతి లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదలతో నష్టపోకుండా ఉండేందుకు కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల హెల్ప్లైన్ సెంటర్ను ఏర్పాటు చేశామని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. హెల్ప్లైన్ నంబర్ 93987 49227లో సంప్రదించాలని కోరారు.
పట్టణంలో విస్తృత పర్యటన..
నిర్మల్ పట్టణంలో కలెక్టర్ వరుణ్రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని ఆర్అండ్బీ, తహసీల్దార్ గెస్ట్హౌస్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలాలను పరిశీలించారు. అంతకుముందు వైకుంఠధామం నిర్మాణ పనులతో పాటు సోఫీనగర్లోని విజయ డెయిరీఫాం, తేనెశుద్ధి కర్మగారాన్ని పరిశీలించి పలు వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం తేనె శుద్ధి కర్మగారానికి వస్తున్న తేనె, మార్కెటింగ్, అక్కడ సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సబ్బుల పరిశ్రమను పరిశీలించిన ఆయన.. గిరి సబ్బుల ప్రాధాన్యత గురించి తెలుసుకున్నారు. మార్కెటింగ్ చేసేందుకు మరింత ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు. విజయ డెయిరీ పాల ఎగుమతులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. పాల మార్కెటింగ్ పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయాశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఆర్డీఏ అధికారులతో సమీక్ష..
డీఆర్డీఏ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలపై కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వరుణ్రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రుణాలు, స్త్రీనిధి రుణాల లక్ష్యం, కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సాహం అందించాలని తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు బ్యాంకు లింకేజీ రుణాలను అందించాలని సూచించారు. అర్హులైన వారికి పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ప్రతినెలా సక్రమంగా అందేలా సిబ్బంది చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.