మంచిర్యాల, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు వైద్యాధికారులను ఆదేశించింది. ఈ మేరకు వైద్యులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ వ్యాధికి ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు? ఏ ఆపరేషన్కు ఎంత ఫీజు తీసుకుంటున్నారు? అనే వివరాలను సేకరిస్తున్నారు. పక్షం రోజుల తనిఖీల అనంతరం ప్రైవేటు దవాఖానల్లో ఫీజులపై కలెక్టర్కు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్, ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్)ను నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం తెలంగాణ హాస్పిటల్స్ అసోసియేషన్తో మాట్లాడి వ్యాధిని అనుసరించి ఫీజుల ధరలు నిర్ణయిస్తామని డీఎంహెచ్వో జీవీ సుబ్బారాయుడు అధికారులు చెబుతున్నారు.
మూడు నెలల క్రితం 37 సీజ్..
మంచిర్యాల జిల్లాలో మూడు నెలల క్రితం అనుమతులు లేకుండా నడుస్తున్న 37 దవాఖానలను అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని కారణంగా వాటిని సీజ్ చేశారు. అనంతరం నిబంధనల ప్రకారం ఆయా ఆస్పత్రులకు తిరిగి అనుమతులు ఇచ్చారు. అలాగే ఏడుగురు వైద్యులు ఉక్రెయిన్లో చదువుకొని.. ఇక్కడ వైద్యసేవలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఉక్రెయిన్ ఎండీ ఫిజిషీయన్ చేస్తే మన దగ్గర ఎంబీబీఎస్గా విధులు నిర్వర్తించాలి. కానీ.. అందుకు విరుద్ధంగా కొందరు వైద్యులు ఎండీ ఫిజిషీయన్లుగా కొనసాగుతున్నట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఐదుగురు డాక్టర్లు ఐదు బృందాలుగా ఏర్పడి మంచిర్యాల జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. గత గురువారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రులను.. శుక్రవారం బెల్లంపెల్లి ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. మూడో రోజైన శనివారం కూడా మంచిర్యాలలో తనిఖీలు నిర్వహించారు.
ఫీజులను నియంత్రిస్తాం..
ప్రైవేటు దవాఖానల్లో అడ్డగోలు ఫీజుల వసూలును నియంత్రి స్తాం. ఏ ఆస్పత్రికి వెళ్లినా ఒకటే ఫీజు ఉండేలా చర్యలు తీసు కుంటాం. మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం 228 ప్రైవేటు ఆస్పత్రులు రిజిస్టరై ఉన్నాయి. నిబంధ నల ప్రకారం.. ఇక నుంచి ప్రతి ప్రైవేటు ఆస్పత్రి ప్రతి జూన్లో ఫీజు వివరాలు ఇవ్వాలి. పై నిబంధనలు పాటించని హాస్పిటల్స్ ఏవైనా ఉంటే మాకు ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే 46 ఆస్పత్రుల్లో తనిఖీలు చేశాం. సోమవారం నుంచి తనిఖీలు వేగవంతం చేస్తాం.
– జీవీ సుబ్బారాయుడు, డీఎంహెచ్వో, మంచిర్యాల.