నేటి నుంచే ‘మృగశిర’ మొదలు
జిమ్మల్లో ఏ, డీ విటమిన్లు, పోషకాలు
తరచుగా తీసుకుంటే రోగనిరోధకశక్తి పెంపు
గుండె జబ్బు, అస్తమా వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు
ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా మత్స్యసిరులు
కార్తె రోజు కూర తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం
మృగశిర అనగానే చేపల కూర గుర్తుకొస్తుంది! ఈ రోజు ఓ చేప ముక్కో.. పులుసో నోటికి తాకాలని జిహ్వ తహతహలాడుతుంది! అందుకే పల్లెల్లో ఎవరింట చూసినా పులుసు మరుగుతుంది.! వాసన ఘుమఘుమలాడుతుంది! ఈ ఆచారం అనాదిగా వస్తుండగా, నేటి నుంచే ‘మృగశిర’ మొదలు కాబోతున్నది. ఎండలతో చెమటలు పోయించిన రోహిణి కార్తె ముగిసి, ముంగిళ్లు చల్లబరిచే కార్తె ప్రారంభం కానున్నది. సీజన్ మారుతున్న ప్రస్తుత సమయంలో చేపలు తినడం వెనుక ఆరోగ్య రహస్యమూ దాగి ఉన్నది. రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు, వ్యాధుల బారిన పడే ముప్పు తగ్గించుకునే అవకాశమున్నది.
కరీంనగర్, జూన్7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మృగశిర కార్తె బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నది. మొదటి రోజు చేపల కూర తినాలనే ఆచారం అనాదిగా వస్తున్నది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగున్నది. అందుకే ఎప్పుడూ తినని వారు సైతం ఆరోగ్యం కోసం ఒకటో, రెండో ముక్కలు తినడం కనిపిస్తుంది. కార్తె ప్రవేశం రోజు చేపలకు ఫుల్ గిరాకీ ఉంటుంది. గిరాకీతోపాటు రేటు కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు బయటి ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మే మత్స్యకారులు ఈ సారి రాష్ట్ర సర్కారు చేపట్టిన ‘నీలి విప్లవం’తో చెరువుల్లో చేపల పంట పండడంతో డిమాండ్కు తగ్గ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. కార్తె రోజు సాధారణ రోజుల కంటే ధరలకు అమ్ముతారు. బొమ్మె అయితే 600 నుంచి 800 దాకా, రవ్వు, బొచ్చె, బంగారుతీగ రకాలు 150 నుంచి 200లకుపైగా, చిన్న జెల్లలు 500లకుపైనే విక్రయిస్తున్నారు.
వ్యాధుల నియంత్రణకు చేపలు..
మృగశిర కార్తెలో చేపలను ఎందుకు తింటారో తెలుసా..? రోకండ్లను సైతం పగుల గొట్టే ఎండలు వెళ్లిపోయాయి. వానలతో పాటు చల్లని, చక్కని వాతావరణాన్ని మృగశిర కార్తె మోసుకొస్తుంది. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర ప్రారంభంలో చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి పాటిస్తున్నాం. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో మన శరీరంలోనూ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. తద్వారా గుండె జబ్బులు, అస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేగాక ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. అలా కాకుండా ఉండాలంటే.. చేపలను తినాల్సిందే. ఈ కార్తెలో పూర్వీకులు శాఖాహారులైతే ఇంగువను బెల్లంలో కలుపుకుని గోలిలాగా తయారు చేసుకొని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువ, చింత చిగురుతో కలుపుకుని తినేవారు.
మృగశిర కార్తె అంటే..
ఆశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కోవిధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయి. దీంతో వాతావారణం ఒక్కసారిగా చల్లబడడం.. ప్రకృతిలో పలు మార్పులు జరిగే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మక్రిములు, క్రిమి కీటకాలు పునరుత్పత్తి అవుతాయి. మానవులలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు వచ్చి, శ్వాస సంబంధ వ్యాధులు వస్తుంటాయి.
గుండెకు ఎంతో మేలు..
రెగ్యులర్గా చేపలు తినడం వల్ల విటమిన్ డీతోపాటు ఒమేగా 3 ఆమ్లాలు ఎక్కవగా లభిస్తాయి. ఇవి అనేక వ్యాధులను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతాయి. ఒమేగా-3 ఆమ్లాలు కంటిచూపును, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె సంరక్షణకు తోడ్పడుతాయి. ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును, అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఇటీవలి కాలంలో హార్ట్ స్ట్రోక్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తరచుగా చేపలను తీసుకోవడం వల్ల గుండె సంబంధింత వ్యాధుల ముప్పును తగ్గించుకునే అవకాశముంటుంది. స్థానికంగా దొరికే నాణ్యమైన పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతో కలిపి వండుకుని తినడం చాలా మంచిదని పలువురు మేధావులు చెబుతున్నారు.
పుష్కలమైన పోషకాలు