ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాగా, ఈ సారి అన్ని జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో అభ్యర్థులకు దూర, వ్యయ భారం తప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలంటే ఉమ్మడి జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ తిప్పలు తప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కాగా, నిర్మల్ జిల్లాలో 19 కేంద్రాల్లో 4492 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా, ఉదయం 10.15 గంటలు దాటితే అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
నిర్మల్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఆదివారం నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. కాగా, మొదటిసారిగా స్థానిక జిల్లా కేంద్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో, అభ్యర్థులకు దూర, వ్యయ భారం తగ్గనుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్, వరంగల్, తదితర నగరాల్లోనే సెంటర్లు ఉండేది. దీంతో అభ్యర్థులు ఒకరోజు ముందుగానే ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. స్థానికంగానే ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అభ్యర్థులకు దూర భారం తగ్గించి, వారికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ స్థానికంగానే పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించింది. నిర్మల్ జిల్లాలో పరీక్షల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ ముషారఫ్అలీ ఫారూఖీ సమీక్షించారు. పూర్తి పకడ్బందీగా ఏర్పాట్లు చేయించారు. జిల్లాలో 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 4492 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష నిర్వహణ కోసం 19 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 19 మంది లైజన్ ఆఫీసర్లు, 19 మంది అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లను నియమించారు. మరో 5 స్పెషల్ స్కాడ్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే పీహెచ్ స్ర్కైబ్, పీహెచ్ నాన్ స్ర్కైబ్లను కూడా నియమించారు. కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
నిఘా నీడన పరీక్షలు..
గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. నిఘా నీడలో పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా రికార్డు చేయనున్నారు. కేంద్రాల వద్ద బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనుండగా, రెండు గంటల ముందునుంచే కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఉదయం 10.15 గంటలు దాటితే కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకు రావాలని సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు కేవలం చెప్పులను మాత్రమే ధరించాలని, షూస్ను ధరించవద్దని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు కేంద్రాల చుట్టూ ఉన్న జిరాక్స్, ఆన్లైన్, మీసేవ సెంటర్లను మూసివేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అలాగే అభ్యర్థులను ఆయా పరీక్షా కేంద్రాలకు చేరవేసే విధంగా ప్రత్యేక బస్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. దీంతో పాటు పరీక్ష రాసే అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు కలెక్టరేట్తో పాటు బస్స్టేషన్ ప్రాంగణంలో హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశారు.