మంచిర్యాల అర్బన్, జనవరి 16 : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిర్వహణ నిధులు మంజూరయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి మొదటి విడుతగా ఆగస్టులో నిధులు మంజూరు చేయగా, తాజాగా రెండో విడుత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మంచిర్యాల జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, ఇందులో 3,629 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి విద్యార్థికి ఆరు నెలలకోసారి రూ.38 చొప్పున విడుదల చేస్తారు. కళాశాల ఆవరణ, తరగతి గదులను శుభ్రం చేయడం, సుద్ద ముక్కలు(చాక్పీసులు), రిజిష్టర్లు, చీపుర్లు, తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్లు తదితర వాటి నిర్వహణకు ఈ నిధులు వెచ్చిస్తారు. ఈ మేరకు 3,629 మందికిగాను రూ.1,37,902 ప్రభుత్వం మంజూరు చేసింది.