రహదారుల నిర్మాణంపై రాష్ట్ర సర్కారు ప్రాధాన్యం
రూ.135 కోట్లతో 148 పనులు
నాణ్యతపై అధికారుల ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం వచ్చిందంటే చాలు.. రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. మూరుమూల పల్లెలు, ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గ్రామాల ‘దారి’ద్య్రపు కష్టాలపై దృష్టిపెట్టింది. మెరుగైన రోడ్లు నిర్మించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఆయా చోట్ల పనులు చేపట్టి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రూ.110 కోట్లతో 168 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టగా, రూ. 25.37 కోట్లతో 7 భారీ వంతెనలు నిర్మించింది. దీంతో వర్షాకాలంలో రాకపోకలకు మార్గం సులువవగా, ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
ఆదిలాబాద్, జూన్ 10 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలతో పాటు ఏజెన్సీ గూడేలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. వానకాలంలో చినుకుపడితే చాలు రోడ్లపై నుంచి నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయేవి. వానకాలం సీజన్లో వ్యవసాయ పనులు, అనారోగ్యంతో బాధపడే వారు చికిత్స కోసం మండల కేంద్రాలు, ఆదిలాబాద్కు రావాలంటే పాడైన రోడ్లతో నరకయాతన అనుభవించాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేసింది. పంచాయతీరాజ్ శాఖ అధ్వర్యంలో మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా రూ.110 కోట్లతో 141 పనులు చేట్టారు. వీటిలో కొత్త రోడ్ల నిర్మాణాలతో పాటు డబుల్ రోడ్ల విస్తరణ పనులు ఉన్నాయి. 168 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చేశారు..
రూ. 25.37 కోట్లతో వంతెనలు..
వానకాలం వచ్చిందంటే చాలు రోడ్లు, వంతెనల పై నుంచి నీరు ప్రవహించేది. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. వర్షం తగ్గిన కొన్ని గంటల తర్వాత వరద ప్రవాహం తగ్గుముఖం పడితే, వంతెనలు దాటేవారు. వైద్యంకోసం వెళ్తున్న వారి పరిస్థితి ఎప్పుడు ఏవుతుందో తెలియదు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం జిల్లాలో వంతెనల నిర్మాణం చేపట్టింది. జిల్లాలో రూ.25.37 కోట్లతో 7 భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. నిర్మాణాలు చివరిదశకు చేరుకోగా అధికారులు త్వరలో వీటిని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణంతో ప్రజలు అత్యవసర సమయాలతో పాటు వానకాలంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు కొనసాగించవచ్చు.
ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఇచ్చోడ మండలం ముక్రా(కే)కు పోయే రోడ్డుమీదుగా ప్రవహిస్తున్న వర్షం నీరు. వానలకు స్థానికంగా ఉన్న వాగు ఉప్పొంగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వంతెన లేకపోవడంతో వానకాలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.4.60 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. దీంతో ముక్రా(కే), ముక్రా(బి), జల్దా, చించోలి, గెర్జా, రఘుగూడ గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పోనున్నాయి.
మారుమూల గ్రామాలకు మెరుగైన రాకపోకలు..
ప్రభుత్వం మారుమూల గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నది. అందులో భాగంగా జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలతో పాటు పల్లెలకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నాం. వంతెనల నిర్మాణాలు సైతం చివరిదశకు చేరుకున్నాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారులతో ప్రజలకు వానకాలంలో సైతం ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించవచ్చు. జిల్లా వ్యాప్తంగా పనులను పరిశీలిస్తూ నాణ్యత పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. స్టేట్ క్వాలిటీ మానిటరింగ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. – మహవీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, పంచాయతీరాజ్ శాఖ, ఆదిలాబాద్