నిర్మల్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి పేదలందరికీ ఉచిత వైద్యం అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు గ్రామీణ ప్రాంత పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏరియా దవాఖానలుగా ఉన్నతీకరించారు. దీంతో పాటు ఇటీవల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సబ్సెంటర్లను కూడా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సబ్సెంటర్లను అప్గ్రేడ్ చేసి కొత్తగా పల్లె దవాఖానలుగా పేరు పెట్టారు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లను బస్తీ దవాఖానలుగా మార్చిన ప్రభుత్వం.. తాజాగా గ్రామీణ ప్రాంత ప్రజల కోసం పల్లె దవాఖానలను ప్రారంభించింది.
నిర్మల్ జిల్లాలోని 50 సబ్సెంటర్లను ఉన్నతీకరించడంతో పాటు వీటి ద్వారా వైద్య సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది ఇటీవలే నియమించారు. ప్రతి పల్లె దవాఖానకు ఒక డాక్టర్తో పాటు మరో ముగ్గురు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కాగా ప్రస్తుతం ఆయా దవాఖానల్లో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపీ సేవలు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు విస్తరించాలని పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు సబ్సెంటర్లలో ఏఎన్ఎం స్థాయి సిబ్బంది మాత్రమే రోగులకు అవసరమైన ప్రాథమిక చికిత్సలను అందించారు. ఇకపై క్వాలిఫైడ్ వైద్యుల పర్యవేక్షణలో పల్లె జనానికి నాణ్యమైన వైద్యం అందనున్నది.
పేదలకు మెరుగైన వైద్యం
గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానల ఏర్పాటుతో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందుతున్నది. ఇక్కడ నివసించే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏడాది క్రితమే ఈ పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది. ప్రారంభంలో డాక్టర్ల కొరత ఉండడంతో ఇప్పటి వరకు జిల్లాలో 17 సెంటర్ల ద్వారా మాత్రమే పేదలకు వైద్య సేవలు అందాయి. తాజాగా మిగతా 33 దవాఖానలకు వైద్యుల నియామక ప్రక్రియ పూర్తి కావడంతో ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న 50 పల్లె దవాఖానల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఇప్పటివరకు ఈ సబ్సెంటర్లలో కేవలం టీకాలు, తల్లీబిడ్డలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. ఏఎన్ఎంల ఆధ్వర్యంలో కొనసాగిన ఈ సెంటర్లు ప్రస్తుతం ఎంబీబీఎస్ వైద్యుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందే చికిత్సల్లో దాదాపు 80శాతం వరకు వైద్య సేవలు ఈ పల్లె దవాఖానల ద్వారా అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలతో బాధపడుతున్న వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందనున్నది. అంతేకాకుండా పల్లె ప్రజలకు సంబంధించి గుండెజబ్బులు, క్యాన్సర్లు, బీపీ, షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులను ముందే గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు, సలహాలతో పాటు మందులు కూడా అందిస్తున్నారు. ఆదివారం మినహా అన్ని రోజుల్లో పల్లె దవాఖానలు ప్రజలకు వైద్య సేవలు అందించనున్నాయి. పల్లె దవాఖానలతో గ్రామీణ ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
పల్లె ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని స్థానికంగానే అందుబాటులో ఉంచాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం ఈ పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది. వీటిని పల్లె ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 పల్లె దవాఖానలు మంజూరు కాగా, మొదట 17 దవాఖానలను ప్రారంభించాం. ఇటీవల మిగతా 33 దవాఖానలకు కూడా వైద్యులను నియమించాం. ఇకపై పల్లె ప్రజలు అనవసరంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు హైరానా పడి పీహెచ్సీలు, నిర్మల్ లాంటి పట్టణాల్లో ఉన్న పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దు. వ్యయ ప్రయాసలను నివారించేందుకే ప్రభుత్వం ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ పీహెచ్సీల్లో లభించే సేవలన్నీ దాదాపుగా అందుతాయి. ఇక్కడ వైద్య చికిత్సలతో పాటు ప్రజలకు తమ జీవన విధానంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన ప్రవర్తన, యోగా, మెడిటేషన్ మొదలగు వాటిపై కూడా అవగాహన కల్పిస్తారు.
– డాక్టర్ ధన్రాజ్, డీఎంహెచ్వో, నిర్మల్