మంచిర్యాల పట్టణం ప్లాస్టిక్ నిషేధం దిశగా సాగుతున్నది. మున్సిపల్ అధికారులు దుకాణాదారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తుండగా సానుకూల స్పందన వస్తున్నది. విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ప్లాస్టిక్ వస్తువులు వాడినా, విక్రయించినా భారీగా జరిమానాలు విధిస్తుండగా అనూహ్య మార్పు కనిపిస్తున్నది. ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు, జ్యూట్, పేపర్ బ్యాగులు ఉపయోగించాలని సూచిస్తుండగా అన్ని వర్గాల్లో చైతన్యం కనిపిస్తున్నది.
మంచిర్యాలటౌన్, నవంబర్ 24 : మంచిర్యాల పట్టణం పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం వైపు సాగుతోంది. ఇందుకు సంబంధించి మున్సిపల్ అధికారులు గడిచిన నెల రోజులుగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. త్వరలోనే ప్లాస్టిక్ రహిత మంచిర్యాలగా రూపుదిద్దుకోనున్నది. ఇందుకు అన్నివర్గాల ప్రజలనుంచి సానుకూల స్పందన వస్తోంది. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను మున్సిపల్ అధికారులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రజలకు వివరించడం, చిన్నపిల్లలు మొదలుకొని.. పెద్దల దాకా ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలను తెలుసుకోగలగడంవంటి అంశాలు ప్లాస్టిక్ను నియంత్రించేందుకు దోహదపడుతున్నాయి. ఇప్పటికే మంచిర్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్, కిరాణాలు, మటన్, చికెన్ దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల స్థానంలో బట్ట సంచులు వాడుతున్నారు.
ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ గ్లాసుల స్థానంలో స్టీలు, పేపర్ గ్లాసులను వాడుతున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, పండ్ల దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లను వాడడం మానేసి వాటి స్థానంలో బట్ట సంచులు, పేపర్ సంచులు వాడుతున్నారు. భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జీఎస్ఆర్ 571(బీ) తేదీ 12-8-2021 ప్రకారం జూలై 2022 నుంచి 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు, ఒక్కసారి వాడిపారేసే (సింగిల్యూజ్) ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు అమ్మినా, వాడినా, నిలువ చేసినా, పంపిణీ చేసినా రూ. 5 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు. జరిమానాలతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకునే వీలుంటుంది. గడిచిన నెలరోజుల్లో మంచిర్యాల పట్టణంలోని పలు దుకాణాల్లో మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ను కలిగి ఉన్న దుకాణాల యజమానులకు పెద్దమొత్తంలో జరిమానాలు విధించారు. పలుమార్లు వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ సమావేశమయ్యారు.
నిషేధించాల్సినవి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. వీటిలో నీళ్ల బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ కోటెడ్ డిస్పోజబుల్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కప్పులు, స్పూన్లు, స్ట్రాలు, ఫోర్క్లు నిషేధం జాబితాలో ఉన్నాయి.
ప్రత్యామ్నామ మార్గాలపై..
ప్లాస్టిక్ నిషేధం తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి సారించారు. ప్లాస్టిక్ స్థానంలో తిరిగి ఉపయోగించే బట్ట సంచులు, జ్యూట్ వస్తువులు, పేపర్ బ్యాగులు, కవర్లు వాడాలని సూచిస్తున్నారు. కూరగాయలు, చికెన్, మటన్, పండ్ల దుకాణాలకు వెళ్లేవారు తప్పనిసరిగా చేతి సంచులను వెంట తీసుకువెళ్లాలని చెబుతున్నారు. స్వయం సహాయక బృందాల మహిళలకు పేపర్, బట్టతో తయారుచేసే సంచుల తయారీలో శిక్షణ ఇప్పించి వాటా ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేలా చర్యలు తీసుకోవడం, తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లను జనావాసాలకు దగ్గరగా, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం చేపట్టాలి.
మంచి స్పందన వస్తున్నది..
ప్లాస్టిక్ నిషేధంపై చేపడుతున్న కార్యక్రమాలపై వ్యాపారులు, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే వ్యాపారులు, తయారీ దారులు, ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ను వాడే దుకాణాల యజమానులతో మాట్లాడాం. తనిఖీలు చేసి నిలువ ఉన్న ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకున్నాం. అన్ని రకాల వ్యాపారాలు చేసేవారితో విడివిడిగా సమావేశమయ్యాం. ప్లాస్టిక్ వాడితే జరుగబోయే పరిణామాలు, తాము తీసుకోబోయే చర్యలు వారికి వివరించాం. పట్టణంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యామ్నాయ వాడకంపై కూడా వివరించాం. ప్లాస్టిక్ కలిగి ఉన్న వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తాం.
– ఎన్ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్, మంచిర్యాల