నార్నూర్, నవంబర్ 27: బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ వంటిదే. ప్రసవ సమయంలో ఒక్కోసారి తల్లి ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. చిన్న వయసులో గర్భం దాల్చడం, ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడం, పోషకాహార లోపం వంటివి ప్రసూతి మరణాలు సంభవించేందుకు కారణాలు. గతంలో ప్రసూతి మరణాలు ఆందోళనకరరీతిలో ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రసూతి మరణాల రేటు గణనీయంగా తగ్గింది.
ప్రసూతి మరణాల రేటు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గర్భిణుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. సరైన సలహాలు, సూచనలతో ప్రభుత్వ దవాఖానల్లో సుఖ ప్రసవాలను ప్రోత్సహించింది. ఉమ్మడి మండల పరిధిలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రం ఉంది. 2022-23లో 295 మంది బాలింతలు సుఖ ప్రసవాలతో ఇంట్లో సంరక్షణ పొందుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం సురక్షితమని గ్రామగ్రామాన విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
తొలి రెండు కాన్పులు జరిగే వారికి కేసీఆర్ కిట్తో పాటు ఆడశిశువు పుడితే రూ.13వేలు, మగశిశువు పుడితే రూ.12 వేల పారితోషికం ఇస్తున్నారు. ప్రతి నెలా గర్భిణులకు ప్రత్యేక చికిత్సలు చేస్తున్నారు. ప్రతిసారి ఐరన్, కాల్షియం,బీ-కాంప్లెక్స్ మాత్రలు ఉచితంగా అందజేస్తున్నారు. దీనికితోడు ఖరీదైన అల్ట్రా స్కానింగ్ తీస్తుండడం, ఐరన్సుక్రోజ్ సూది మందు ఇచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. రక్తహీనత ఉన్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సుఖ ప్రసవం జరిగే వరకూ ఏఎన్ఎం లేదా ఆశ కార్యకర్తను ఎస్కార్ట్గా నియమిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఎన్నడూలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పోషణ్ ప్లస్ లాంటి గొప్ప పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యం మూడు కేజీలు, ఒక కేజీ పప్పు, 500 గ్రాముల పామాయిల్, 25 కోడిగుడ్లు, ఆరు లీటర్ల పాలు, కూరగాయలు వంటివి ప్రతి నెలా అందేలా చర్యలు చేపట్టారు. తద్వారా గర్భిణులు రక్తహీనతను అధిగమించి సుఖ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టింది. ఇందులో ప్రతిరోజూ బియ్యం150 గ్రాములు, పప్పు 30 గ్రాములు, నూనె 16 గ్రాములు, కూరగాయలు 50 గ్రాములు, పాలు 200 గ్రాములు, ఒక గుడ్డు అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్నారు.
గర్భిణిగా నిర్ధారణ అవగానే ఆయా ఉప కేంద్రాల పరిధిలో పేర్లు నమోదు చేసుకుంటారు. వారంలో రెండుసార్లు వైద్య సిబ్బంది వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఆరోగ్యం గురించి ఆరా తీయడం, బీపీ చెక్ చేయడం, నెలవారీ చికిత్సలకు దవాఖానలకు తీసుకెళ్లేలా కృషి చేస్తారు. గతంలో వైద్య సేవల్లో అనేక లోపాలుండేవి. ప్రస్తుతం జిల్లా, ప్రాంతీయ వైద్యశాలల్లో ప్రత్యేక గైనిక్ వైద్యులను నియమించి సేవలు మెరుగుపరిచారు.
24 గంటల్లో ఏ సమయంలో పురిటి నొప్పులు వచ్చినా సత్వరం దవాఖానకు చేర్చేలా మండల పరిధిలో ఒక 108 వాహనం అందుబాటులోకి తె చ్చారు. ఐటీడీఏ పరిధిలో అంబులెన్స్లున్నాయి. అత్యవసరమైతే ఆ వాహనంలోనే సుఖ ప్రసవం చేసేలా తగినన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రస వం తర్వాత దవాఖాన నుంచి ఇంటికి చేర్చేందుకు 102వాహన సదుపాయం అందుబాటులో ఉంది.
గర్భ నిర్ధారణ నుంచి వైద్యులు చికిత్సలు అందించారు. తొమ్మిది నెలల పాటు వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్త మాతాశిశువు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకునే వారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సలహాలు, సూచనలిచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖ ప్రసవం అయ్యేలా చూశారు. 102 వాహనంలో ఇంటికి చేర్చారు.
– జాడే నీలాబాయి, బాలింత, మాన్కాపూర్
గర్భం దాల్చిన మొదటి నెల నుంచే చికిత్స అందిస్తున్నారు. మందులు ఇవ్వడంతో పాటు నా ఆరోగ్యంపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రతినెలా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవం చేయించుకునేలా అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రంలోనూ నాణ్యమైన సరుకులు ప్రతినెలా అందిస్తున్నారు. గర్భిణులకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవలు ఎంతో బాగున్నాయి.
– అంబుతాయి, గర్భిణి, ఖాతిగూడ
ప్రసూతి మరణాలు తగ్గించేలా వైద్యశాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టాం. గర్భిణులకు పోషకాహార లోపం లేకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమన్వయం చేస్తున్నాం. ప్రసూతి మరణాలు జరగకుండా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కృషి ఆమోఘం.
– కుడ్మెత మనోహర్, అడిషనల్ డీఎంహెచ్వో