నిర్మల్, జనవరి 27(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో శానిటేషన్ పనులపై కలెక్టర్ ప్రత్యేక దష్టి సారిస్తున్నారు. ఇప్పటికే నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల కమిషనర్లతో సమీక్ష జరిపి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇక నుంచి శానిటేషన్ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు సార్లు బయోమెట్రిక్ హాజరును తీసుకోనున్నారు.
బయోమెట్రిక్తో హాజరు విధానం గాడిన పడే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు చెత్త సేకరించే వాహనాలన్నింటికీ జియో ట్యాగింగ్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ వాహనానికి జీపీఎస్ పరికరం అమర్చి, ఆ వాహనం ఏ ప్రాంతం నుంచి చెత్తను సేకరిస్తున్నదనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నారు. చెత్త సేకరణకు సంబంధించి సరైన వేళలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నా యి. దీంతో పాటు మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించడం, సమయ పాలన పాటించకపోవడం రివాజుగా మారింది. ఈ విషయంపై కూడా కలెక్టర్ దృష్టి సారించి ఆయా కార్యాలయాల్లోని అన్ని సెక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సీసీ కెమెరాలను కలెక్టరేట్కు అనుసంధానం చేసి అక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు.
అడ్డగోలు హాజరుకు ఇక చెక్…
పారిశుధ్య సిబ్బంది ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సూపర్వైజర్లతో మిలాఖత్ అవుతున్న కొంత మంది సిబ్బంది తమ విధులకు డుమ్మా కొట్టి ప్రైవేటు దందాలు కూడా చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కలెక్టర్ రోజుకు రెండు సార్లు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద యుద్ధ ప్రాతిపదికన బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. చెత్త సేకరించే వాహనాల్లో కొన్నింటికి జియోట్యాగింగ్ కూడా పూర్తయింది. మిగతా మున్సిపాలిటీల్లో కూడా త్వరలోనే బయోమెట్రిక్, జియోట్యాగింగ్ అమలుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
80 వాహనాలకు జీపీఎస్
నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలోని 80 చెత్త సేకరణ వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చనున్నారు. ఖానాపూర్లో 10, భైంసాలో 29, నిర్మల్లో 41 వాహనాలకు జియోట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో 35మంది, భైంసా మున్సిపాలిటీలో 91మంది, నిర్మల్ మున్సిపాలిటీలో 242మంది పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇలా చెత్త సేకరణ వాహనాలకు జియోట్యాగింగ్, పారిశుధ్య సిబ్బందికి బయోమెట్రిక్ హాజరుతో ఇకపై మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణను మరింత పకడ్బందీగా చేపట్టనున్నారు. నిర్మల్, భైంసా మున్సిపాలిటీల పరిధిలో కలెక్టర్ ఆదేశాల మేరకు పారిశుధ్య సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ తెలిపారు.
చెత్త సేకరణ వాహనాలకు జియోట్యాగింగ్ పరికరాలను బిగిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ప్రతిరోజూ చెత్త వాహనాలు ఏయే రూట్లలో, కాలనీల్లో చెత్తను సేకరించాయి అనే విషయాలను ఆన్లైన్ ద్వారా మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని అన్ని విభాగాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఉద్యోగుల హాజరుతో పాటు పనితీరును తెలుసుకునేందుకు వీలుగా సీసీ కెమెరాలను కలెక్టరేట్తో అనుసంధానించినట్లు తెలిపారు.