ఇంద్రవెల్లి, అక్టోబర్ 5 : రైతులు తమ వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, భూమి పట్టా రద్దు చేస్తారని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ హెచ్చరించారు. మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన ఓ ఆదివాసీ గిరిజన రైతు తన పత్తిపంటలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను బుధవారం ఎస్పీ ఆదేశాల మేరకు ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి ఎస్ఐ డీ సునీల్తో పాటు ప్రత్యేక పోలీస్ బలగాలతో ధ్వంసం చేశారు. పత్తిలో గుర్తించిన గంజాయి మొక్కలను తొలగించి అక్కడే దహనం చేశారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ. ఇంద్రవెల్లి మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు తన సొంత ఎనిమిది ఎకరాల భూమిలో పత్తిపంట వేశాడని, అందులో అంతరపంటగా గంజాయి సాగు చేశారని పేర్కొన్నారు. ముందస్తుగా అందిన సమాచాం మేరకు ఎస్పీ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బలగాలతోపాటు పర్యటించామని చెప్పారు. గంజాయి మొక్కలను గుర్తించి వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్ సీఐ మంగమ్మ సమక్షంలో 177 గంజాయి మొక్కలను అక్కడే దహనం చేశామని పేర్కొన్నారు. గంజాయి సాగు చేసిన రైతుపై ఇంద్రవెల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పార్టీ ఏఎస్ఐ ప్రకాశ్, ఇంటెలిజెన్స్ పోలీస్ రామారావ్, స్పెషల్ పోలీస్ దుర్వ రామన్న, సర్పంచులు తుంర6ం లక్ష్మణ్, మర్సుకోల జాకేశ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.