ఆదిలాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): అగ్రశేణి నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ఆదిలాబాద్కూ చేరువైంది. జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 40 కోట్లు మంజూరు చేయడం సర్వత్రా సరికొత్త ఆశలను రేకెత్తిస్తున్నది. ఇటు నిరుద్యోగ యువతలో ఉత్సాహం నిండగా, అటు జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. మరోవైపు జిల్లా కేంద్రంలోని బీడీఎన్టీ, ఎన్టీటీ ఐటీ కంపెనీ ఉద్యోగులు శుక్రవారం కేక్కట్ చేసి సంబు రాలు నిర్వహించారు. ఐటీ టవర్ నిర్మాణం పూర్తయితే మల్టీ నేషనల్, స్టార్టప్ కంపెనీలు వచ్చే అవకాశమున్నదని అభిప్రా యపడ్డారు. వెయ్యి మందికి పైగా యువతీయువకులకు భారీ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు నిర్మాణ, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్కు రూ. 40 కోట్ల మంజూరు చేయడంపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యువత జోష్తో సంబురాలు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీడీఎన్టీ, ఎన్టీటీ ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. జిల్లాలో యువతకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయని, మఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న కృషే ఇందుకు కారణమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ ఐటీ టవర్లో దేశ, విదేశాలకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీలు, స్టార్టప్లు వచ్చే అవకాశాలున్నాయని ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఐటీ ఉద్యోగాలు రానుండడంతో జిల్లాలో వ్యాపార రంగాలు, ఇండ్ల నిర్మాణాలకు డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.
అడవుల జిల్లాకు ఐటీ సొబగులు
అగ్రశేణి నగరాలకే పరిమితమైన ఐటీ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించింది. రూరల్ టెక్నాలజీ పాలసీలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐటీ టవర్లను నెలకొల్పడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా అడవుల జిల్లా ఆదిలాబాద్కు కూడా ఐటీ రంగం విస్తరించింది. ఏడాది కిందట బీడీఎన్టీ, ఎన్టీటీ ఐటీ కంపెనీ ప్రారంభమైంది. ఇందుకోసం ప్రభుత్వం భవనాన్ని సమకూర్చింది. జిల్లాలో గతేడాది సెప్టెంబరులో పర్యటించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా కేంద్రంలోని ఈ ఐటీ కంపెనీని సందర్శించి నిర్వాహకులు, ఉద్యోగులతో మాట్లాడారు. ఉద్యోగులు పలు దేశాల కంపెనీలతో పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాకు ఐటీ టవర్ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకుల కోరిక మేరకు. కంపెనీలోని విద్యుత్, ఇతర సౌకర్యాల కల్పన కోసం మంత్రి కేటీఆర్ రూ.1.50 కోట్లను మంజూరు చేశారు. టవర్ ఏర్పాటులో భాగంగా అధికారుల స్థల సేకరణ పూర్తి చేయగా, నిర్మాణం కోసం రూ.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఫలితంగా త్వరలోనే ఐటీ టవర్ పనులు ప్రారంభం కానున్నాయి.
కలలో కూడా ఊహించలేదు..
హైదరాబాద్, బెంగళూరు, పుణె లాంటి నగరాలకే పరిమితమైన ఐటీ టవర్లు ఆదిలాబాద్ జిల్లాకు కేడా వస్తాయని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం ఐటీ రంగానికి పెద్దపీట వేస్తూ ద్వితీయశ్రేణి రంగాలకూ ఐటీ పరిశ్రమలను విస్తరిస్తున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్లో రూ.40 కోట్లతో ఐటీ టవర్ను ఏర్పాటు చేస్తున్నది. నేను ఇక్కడే ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. సొంత ప్రాంతంలో ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. కొత్తగా నిర్మించే ఐటీ టవర్లో మాలాంటి యువతకు భారీ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి.
– యల్చల్వార్ లక్ష్మణ్, సాఫ్ట్వేర్ డెవలపర్, బీడీఎన్టీ ఐటీ కంపెనీ ఆదిలాబాద్
ప్రతిభను చాటుకునే అవకాశం
ఆదిలాబాద్లో ప్రభుత్వం ఐటీ టవర్ను నిర్మించడం చాలా గొప్ప విషయం. ఐటీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో మరిన్ని కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశమున్నది. యువత కూడా తమ ప్రతిభను చాటుకునే వీలుంటుంది. టవర్ పూర్తయితే సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న. ఈ అవకాశాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలి.
– బీ సంతోష్కుమార్, బీడీఎన్టీ ఐటీ కంపెనీ, మేనేజర్
సొంత జిల్లాలో ఉద్యోగం
నేను గతంలో హైదరాబాద్ ఐటీ కంపెనీలో పనిచేశా. అక్కడ ప్రయాణభారంతో పాటు, ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆదిలాబాద్లో ఐటీ కంపెనీ ప్రారంభం కావడంతో సొంత జిల్లాలో పనిచేసే అవకాశం లభించింది. ఏడాదిగా ఇక్కడే పనిచేస్తున్నాను. కొత్తగా ప్రారంభమయ్యే ఐటీ టవర్లో వివిధ కంపెనీలు వస్తాయి. దీంతో జిల్లాకు చెందిన వారికి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న కృషితో ఈ టవర్కు అడుగులు పడుతున్నాయి.
– కాటిపల్లి ప్రియారెడ్డి, జావా డెవలపర్, ఆదిలాబాద్
మహిళా ఉద్యోగులకు మంచి అవకాశం
మహిళలు హైదరాబాద్, బెంగళూరు, ఇతర నగరాలకు పోయి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఐటీ అంటేనే పలు షిప్టుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం ఐటీ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నది. ఆదిలాబాద్లోనే కంపెనీ ఏర్పాటు చేయడంతో నాకు సొంత జిల్లాలోనే పనిచేసే అవకాశం లభించింది. ఇక్కడ అమ్మాయిలే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించే ఐటీ టవర్లో కూడా ఎక్కువ మంది యువతులకు ఉద్యోగాలు లభిస్తాయి. వారు నిర్భయంగా పనిచేసుకునే అవకాశం ఉంటుంది.
– కాటోజు సాయి ప్రసన్న , జావా డెవలపర్ ఆదిలాబాద్
ఇతర రంగాలూ అభివృద్ధి చెందుతాయి
జిల్లా కేంద్రంలో ఇప్పటికే 130 మంది ఉద్యోగులతో బీడీఎన్టీ, ఎన్టీటీ ఐటీ కంపెనీలు నడుస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న ఐటీ టవర్లో వెయ్యికి పైగా మందికి ఉద్యోగాలు వస్తాయి. పది కంపెనీలు వచ్చే అవకాశమున్నది. వేతనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఐటీ టవర్ నిర్మిస్తే వ్యాపార రంగం, హోటళ్లు, ఇండ్ల నిర్మాణాలు, పర్యాటక ప్రాంతాలు, వినోదం, విజ్ఞాన రంగాల అభివృద్ధి సైతం సాధ్యపడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ టవర్ను ఏర్పాటు చేయడం ప్రశంసనీయం.
– అభిషేక్, ఎన్టీటీ, ఐటీ మేనేజర్, ఆదిలాబాద్