ఆదిలాబాద్, ఆగస్టు 18 ( నమస్తే తెలంగాణ): అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు అనేక పథకాలు తీసుకొచ్చి అండగా నిలుస్తున్నది. ‘దళితబంధు’, ‘బీసీబంధు’తో పేరిట ఆర్థిక భరోసానిస్తుండగా, తాజాగా మైనార్టీలకూ రూ. లక్ష సాయమందించేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు మొదటి విడుతలో భాగంగా ఆదిలాబాద్లో 222, నిర్మల్లో 232 మంది లబ్ధిదారులను అధికార యంత్రాంగం ఎంపిక చేసింది. ఆదిలాబాద్ లబ్ధిదారులకు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో చెక్కులను శనివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్రాజ్ పంపిణీ చేయనున్నారు. నిర్మల్ లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా రెండు, మూడు రోజుల్లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -ఆదిలాబాద్, ఆగస్టు 18 ( నమస్తే తెలంగాణ)
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. కులవృత్తులను ప్రోత్సహించడంతో పాటు మైనార్టీలకు ఆర్థికంగా నిలదొక్కుకునేలా పకడ్బందీ ప్రణాళికలు తయారు చేస్తున్నది. సర్కారు అందిస్తున్న సాయంతో పేదల ఉపాధి ఎంతో మెరుగుపడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి కోసం గ్రామాలు వదిలి పట్టణప్రాంతాలకు వలస పోయే పేదలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వడంతో తమ సొంత ఊర్లలోనే ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే బీసీలకు మొదటి విడుతలో నియోజకవర్గానికి 300 మంది చొప్పున రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అధికారులు అందజేశారు. బీసీలకు రూ. లక్ష సాయం పంపిణీ నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి, సాయం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక పేద మైనార్టీలకు సైతం రూ.లక్ష సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం అర్హుల ఎంపిక పూర్తి చేశారు. జిల్లాలో మొదటి విడుతలో 222 మంది మైనార్టీలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.
నేటి నుంచి పంపిణీ
జిల్లాలో రూ.లక్ష సాయం పంపిణీకి 222 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. నేటి నుంచి వారికి సాయం అందించనున్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో లబ్ధిదారులకు చెక్కులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్రాజ్ పంపిణీ చేయనున్నట్లు మైనార్టీ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధి లో 90 మంది, ఆదిలాబాద్ రూరల్ మండలంలో ని 32 మంది, మావలలో 4, బజార్హత్నూర్లో 6, బేలలో 6, బోథ్లో 6, గుడిహత్నూర్లో 6, ఇచ్చోడలో 28 మంది, ఇంద్రవెల్లిలో 8మంది, జైనథ్లో 4, నార్నూర్లో 8 మంది, నేరడిగొండలో 4, తలమడుగులో 4, తాంసిలో 6, ఉట్నూర్లో 14 మందికి ఒక్కొక్కరికీ రూ. లక్ష చెక్కులను అందించనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం వారి ఉపాధిని మెరుగుపర్చడానికి ఎంతగానో ఉపయోగపడనున్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్, ఆగస్టు 18 ( నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలో మైనార్టీలకు రూ. లక్ష సాయం కింద మొద టి విడుతలో మొత్తం 232 మంది అర్హులను ఎంపి క చేశారు. వీరిలో నిర్మల్ నియోజకవర్గానికి 100, ముథోల్ నియోజకవర్గానికి 113, ఖానాపూర్ ని యోజకవర్గం నుంచి 19 మందికి లక్ష రూపాయల సాయాన్ని అందించనున్నారు. రెండు, మూడు రో జుల్లో మంత్రి చేతుల మీదుగా ఈ సహాయాన్ని అం దించనున్నారు. అలాగే రెండో విడుతలో నియోజకవర్గానికి 120 మందికి చొప్పను రూ. లక్ష సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలోని 16 మండలాలు, ఏడు మున్సిపాలిటీల పరిధిలోని ముస్లిం మైనార్టీల నుం చి దరఖాస్తులు స్వీకరించింది. మొదటి విడుత కేటాయించిన వంద యూనిట్లకు దరఖాస్తులు రాగా, పట్టణాల్లో కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీవోలు పరిశీలించి అర్హులకు యూనిట్లు కేటాయించారు.
యూనిట్లు ఇలా..
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8,02,130 మంది జనాభా ఉండగా, ఇందులో ముస్లిం మైనార్టీలు 45,549 (5.68 శాతం) మంది ఉన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం జిల్లాలో 69 రకాల యూనిట్లకు రుణం మంజూరు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా చిన్న తరహా వ్యాపారాలైన పండ్లు, జ్యూస్ సెంటర్, పిండి గిర్నీ, కారం మిల్లు, జిరాక్స్, ఆన్లైన్ సెంటర్, టైలరింగ్తో పాటు పలు రకాల యూనిట్లకు రాయితీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ రుణాలతో కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేయడం లేదా ఇప్పటికే కొనసాగుతున్న వాటికి ఆ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.
జిల్లాకు మొదటి విడుత 100 యూనిట్లు..
మొదటి విడుత 100 మంది అర్హులకు వంద శాతం సబ్సిడీతో ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం అందనున్నది. ఇందులో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో 27 మంది లబ్ధిదారులకు, చెన్నూర్ నియోజక వర్గంలో 27 మందికి, మంచిర్యాల నియోజక వర్గంలో 39 మందికి, ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలంలో ఏడుగురు మైనార్టీలకు రూ. లక్ష చొప్పున అందించనున్నారు. లబ్ధిదారులలో 62 మంది పురుషులుండగా, 33 మంది మహిళలు, ఐదుగురు దివ్యాంగులు ఉన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 112 మంది ఎంపిక
జిల్లాలో ముస్లిం మైనార్టీ బంధుపథకాన్ని అందించేందుకు మొదటి విడుతలో 112 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 56 మంది, సిర్పూర్ నియోజకవర్గంలో 56 మందిని ఎంపిక చేశారు. ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయంమందించేందుకు చెక్కులను సిద్ధం చేశారు. మొత్తం 3 వేల మంది దరఖాస్తులు చేసుకోగా, మొదటి విడుతలో 112 మందిని ఎంపిక చేశారు. నేటి నుంచి చెక్కులు పంపిణీ చేయనుండగా, ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.