మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 27 : పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని పాతగర్మిళ్ల, ఎన్టీఆర్ నగర్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్మిక నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవమున్న కొప్పుల ఈశ్వర్ను గెలిపించుకుంటేనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
కాంగ్రెస్ రైతు రుణమాఫీ, మహిళలకు రూ. 2500, రైతుబంధు, క్వింటాలుకు రూ. 500 బోనస్, రూ. 500కే వంట గ్యాస్, తదితర హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి బీఆర్ఎస్ నాయకులను అనరాని మాటలంటున్నారని మండిపడ్డారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. కేసీఆర్ పాలనలో పంటలు పచ్చగా ఉండి అధిక దిగుబడులు సాధించిన విషయాన్ని గుర్తుకు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరో వార్డు కౌన్సిలర్ సుంకరి శ్వేత, నాయకులు సుంకరి రమేశ్, ప్రశాంత్, సుఖన్య, కౌసల్య, గంగులు, ఎగ్గెన మల్లేశ్, బిలాల్, మోతు సత్తయ్య, ఇప్ప సురేశ్, కర్రు శంకర్ పాల్గొన్నారు.