మంచిర్యాల ఏసీసీ, మార్చి 27: కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుపై ఇష్టారీతిన మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ నాయకులు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హయాంలో వేల కోట్ల రూపాయలతో మంచిర్యాల అభివృద్ధి జరిగిందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్, గూడెం రమాసత్యనారాయణ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 30 వేల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయంటే అది దివాకర్రావు పుణ్యమేనని గుర్తు చేశారు.
మంచిర్యాలలో జిల్లా ప్రజల కోసం మెడికల్ కాలేజ్ కల నెరవేర్చిన ఘనత, టూ టౌన్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి అండర్ బ్రిడ్జి నిర్మాణం, అంతర్గాం బ్రిడ్జి టెండర్, రూ.15 కోట్లతో బైపాస్ రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. కూడళ్ల సుందరీకరణ కావడంతో ప్రజలు సెల్ఫీలు దిగుతున్నారని తెలిపారు. సింగరేణిలో పట్ట్టాలు, రాజీవ్నగర్లో 8వేల మందికి ఇండ్ల స్థలాలు ఇప్పించిన ఘనుడు ఎవరో తెలుపాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు రూ.35 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు, పాతమంచిర్యాల నుంచి సున్నంబట్టి వాడ, ఆండాళమ్మకాలనీ, తిలక్నగర్, గోపాల్వాడ, ఓవర్బ్రిడ్జి రోడ్డు వెడల్పు పనులకు రూ.15కోట్లు, రూ.4 కోట్లతో డాంబర్ రోడ్లు, రూ.15 కోట్లతో టీయూఎఫ్ఐడీసీ టూటౌన్ కు 60 ఫీట్ల రోడ్డు పనులు డెవలప్మెంట్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు రూ.202 కోట్ల అభివృద్ధి పనులు చేశారంటున్నారని, ఎక్కడ పనులు చేశారో చూపించాలని సవాల్ విసిరారు. డీఎంఎఫ్టీ నిధులకు సంబంధించి 430 వర్కులు దివాకర్ రావు సాంక్షన్ చేయిస్తే ఆ వర్కులనే క్యాన్సల్ చేయించి జీవోలను మార్చి మళ్లీ టెండర్లకు పిలుస్తున్నారని ఆరోపించారు. రంగంపేట బ్రిడ్జిని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సాంక్షన్ అయిన జీవో 723 నిధులు 12 కోట్లు, 143 జీవో ప్రకారం స్టార్టర్హౌస్ కోసం తీసుకొచ్చిన నిధులు రూ.1.50 లక్షలు కలిపి మొత్తం రూ.13.50 కోట్లతో బ్రిడ్జిని నిర్మిస్తున్నామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎంసీహెచ్కు సంబంధించి దివాకర్రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రూ.500 కోట్లతో మార్కెట్ యార్డు ఏరియాలో 350 పడకల దవాఖాన నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఐబీలో ఎంసీహెచ్ కడితే తల్లి ఒకచోట బిడ్డ మరోచోట ఉంటుందన్నారు. ఐబీలో మార్కెట్ను కూల్చితే బీఆర్ఎస్ అడ్డుకుంటుందని హెచ్చరించారు. అమృత స్కీం కోసం నస్పూర్కు రూ.70 కోట్లు , లక్షెట్టిపేటకు రూ.20 కోట్లు, మంచిర్యాలకు రూ.48.05 కోట్లు మొత్తం రూ.140 కోట్లు తీసుకొచ్చింది దివాకర్రావు అని స్పష్టం చేశారు.
ఎన్హెచ్ 64 గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారా, అనుకూలిస్తున్నారా తేల్చిచెప్పాలన్నారు. గతంలో కరకట్ట నిర్మాణానికి రూ.270 కోట్లు మంజూరు చేయించిన అని ప్రెస్మీట్లు పెట్టి చెప్పి, అసెంబ్లీ సమావేశాల్లో కరకట్ట నిర్మాణం కోసం నిథులు కేటాయించాలని ఎమ్మెల్యే అడిగారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ జీవోలకు సంబంధించిన నిధులన్నీ దివాకర్రావు తెచ్చినవేనని, కాంగ్రెస్ వాళ్లు తెచ్చింది ఏదైనా ఉంటే బయట పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సందెల వెంకటేశ్, గోగుల రవీందర్ రెడ్డి, ఎర్రం తిరుపతి, తోట తిరుపతి, చంద్రశేఖర్ హండే పాల్గొన్నారు.