మంచిర్యాల, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ప్రజలు ఆరు నెలలకే రోడ్ల మీదకు వచ్చారని, ఇప్పుడు తెలంగాణలో రెండు నెలల్లోనే మేము ఏం అనకపోయినా ప్రజలే మేము ఇంత ఘోరంగా మోసపోతిమి.. ఇట్ల జేస్తరనుకోలేదని కాంగ్రెస్ను ఛీత్కరిస్తున్నారని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఉద్ఘాటించారు. దుష్పచారాలతో మా మీద విముఖత వచ్చి మిమ్ములను ప్రతిపక్షంలో కూర్చొపెట్టడానికి తొమ్మిదన్నరేండ్లు పడితే, అదే కాంగ్రెస్పై రెండు నెలల్లో విముఖత వచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ స్వగృహంలో ఆదివారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఇంద్రవెల్లిలో మారణకాండ సాగించిన కాంగ్రెస్ పార్టీ అక్కడే సభ నిర్వహించడం అనైతికం, దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం.. అంటే ఏం తెస్తారు.. మళ్లీ ఇంద్రవెల్లి కాల్పులు తెస్తారా.. దేశంలో మరోసారి ఎమర్జెన్సీ తెస్తారా.. అదేనా మీరు తెచ్చే ఇం దిరమ్మ రాజ్యం అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మా ప్రభుత్వాన్ని పడగొడుతారంటా.. వీళ్లు పడగొడుతారంటా.. వాళ్లు పడగొడుతారంటా అని భుజాలు ఎందుకు చరుచుకుంటున్నరో అర్థం కావడం లేదన్నారు. మా పని మాకు మస్తుగా ఉందన్నారు. మీ హామీలను గుర్తు చేసుకుంటా పోవుడే మా పని అని, మిమ్ములను బొంద పె ట్టడానికి అవి సరిపోతాయని స్పష్టం చేశారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీ ఒక ప్రణాళికతో చేసిన దుష్ప్రచారం, ఇచ్చిన అబద్ధపు హామీలతోనే అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడంపై దృష్టి సారించాలని హితువు పలికారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యేట్లు పని చేయాలని సూచించారు.
ఆ పని పక్కన పెట్టి విపక్ష పార్టీలు, నాయకుల మీద కక్ష సాధించి వెళ్లిపోతామన్నట్లు ప్రజలు అంత అమాయకులు ఏం కాదన్నారు. ఆకలిగున్న ప్రజలకు రెండు, మూడు రోజుల వాయిదా నడుస్తదని, కడుపులో ఎండిన తరువాత వాళ్ల ఆగ్రహం ఎట్లా ఉంటదో మీరే చూస్తారన్నారు. మేం చేయాల్సిన పని మేము చేస్తే చాలు భవిష్యత్లో మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారని, మీ ప్రభుత్వాన్ని పనిగట్టుకొని పడగొట్టాల్సిన అవసరం మాకు లేదని చురకలు అంటించారు.
రైతుబంధు కోసం కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన రూ.7,700 కోట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కన్స్ట్రక్షన్ కంపెనీలోకి, కాంగ్రెస్ కాంట్రాక్టర్ల బేబుల్లోకి పోయాయని మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు, అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. డిసెంబర్ 9వ తేదీన చేస్తామన్న రైతు రుణమాఫీ, రూ.4 వేల పింఛన్, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం చేసి పంపిన 65 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సెక్రటేరియట్లో నిలిపివేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు ఇలాంటి చిల్లర పనులు చేయలేదన్నారు.
చెన్నూర్ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ నియోజకవర్గానికి నిధులు తెచ్చేందుకు కాకుండా ఆయన కొడుకు కోసం ఎంపీ టికెట్ తీసుకువచ్చేందుకే ఎక్కువగా తిరుగుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ది కుటుంబ పాలన అని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు గడ్డం వినోద్, గడ్డం వివేక్కు ఇచ్చి, ఎంపీ సీటు వాళ్ల కొడుక్కు ఇస్తే అది కు టుంబ పాలన కాదా జనం ఆలోచించాలన్నారు. ని యోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని, సింగరేణి కార్మికులకు పన్ను మినహాయింపు ఇస్తామని, క్వా ర్టర్లు ఖాళీ చేయిస్తామని ఇలా ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తారో.. లేదో చూద్దామన్నారు. హామీలు అమలు చేస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే వివేక్ ప బ్లిక్ టాయిలెట్లు ప్రారంభించుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు.
ఎవరెన్నీ ఇబ్బందులు పెట్టినా తా ను నియోజకవర్గం వదిలి పోయేది లేదన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేశారని ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయో జనం ఆలోచించాలన్నారు. వందల కోట్లు ఉన్న వారిని మళ్లీ ఓడించే దాకా చెన్నూర్ విడిచిపెట్టి పోయేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా పోరాటం ఆపేది లేదన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా జనం ఇచ్చిన బాధ్యతను వంద శా తం నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలకు తాను, కేసీఆర్ తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ.. ఇన్చార్జి మంత్రి సీతక్క జై తెలంగాణ అనాల్సిన అవసరం లేదు.
అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జై హింద్ అనేది ఇండియా ఎలానో జై తెలంగాణ అనేది తెలంగాణకు అంతే గొప్పదన్నారు. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటున్నది అన్నారు. డీఎంఎఫ్టీ నిధులు ఆపే అధికారం ఎవరికీ లేదని, ఒకవేళ ఆపితే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. డీఎప్ఎఫ్టీ నిధులు ఆపొద్దని కలెక్టర్కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమన్నారు. మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడడానికి అంతా కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.