వాంకిడి మండలం ఖానాపూర్ అటవీప్రాంతంలో సిడాం భీము(69)పై దాడి చేసి చంపిన పులి జాడ కోసం అటవీశాఖ రంగంలోకి దిగింది. పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. కాగజ్నగర్లోని పెద్ద వాగు వైపు వెళ్లినట్లు సమాచారముండగా, ఆధారాలు గుర్తించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. రైతుపై పంజా విసిరింది చిరుతపులా.. లేక పెద్ద పులా.. అనేది గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు సైతం జరిపిస్తున్నది. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజన గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతుండగా, అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ సిబ్బంది డప్పు చాటింపు చేయిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కాగజ్నగర్ రూరల్, నవంబర్ 18 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మం డలం చౌపన్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్కు చెందిన ఆదివాసీ రైతు సిడాం భీము (69)పై దాడి చేసి చంపిన పులి జాడ కోసం అటవీ అధికారులు అన్వేషిస్తున్నారు. గురువారం రాత్రి కాగజ్నగర్-పెద్దవాగు సమీపంలో సంచరించినట్లు సమాచారమందడంతో ఆ పులిని ట్రాక్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దులోని గోండాపూర్ నుంచి వచ్చిన పులి నాలుగు రోజుల క్రితం భీముపై దాడి చేసింది. ఆపై అక్కడి నుంచి ఖానాపూర్-నార్లపూర్-సామెల మీదుగా కాగజ్నగర్ పెద్దవాగు వైపు వచ్చినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. దానిని గుర్తించేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచే జిల్లా అటవీ అధికారి దినేశ్కుమార్, కాగజ్నగర్ డివిజన్ అటవీ అధికారి విజయ్కుమార్ తమ సిబ్బందితో కలిసి కాగజ్నగర్ పెద్దవాగు పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
నిరంతరం నిఘా…
సిడాం భీముపై దాడిచేసిన పులిని గుర్తించేందుకు అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. కాగజ్నగర్ పెద్దవాగు పరిసర ప్రాం తాల్లో పులి అడుగుజాడల కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పులి ఎటువైపు నుంచి వచ్చిం ది.. ఎక్కడికి వెళ్లింది అనే విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఖానాపూర్ అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రాకర్స్తో కూడిన రెండు టీంలను నిఘాకోసం పెట్టారు. పలు ప్రాంతాల్లో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గోవెన, రెబ్బెన, అగర్గూడ, దిగడ, తుంగెడ, రాంపూర్ ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని భావిస్తున్నారు. పెద్దవాగు పరిసరాలతో పాటు సిర్పూర్-టీ రైల్వే ట్రాక్ అటవీ ప్రాంతంలో పులి అడుగు జాడల కోసం పరిశీలించారు. పులి రైల్వే పట్టాలు దాటి శివపూర్, బారెగూడ ప్రాంతాల్లోని పత్తి చేలల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివపూర్, బారెగూడ గ్రామాల్లో చాటింపు చేశారు. రైతుపై దాడికి పాల్పడింది చిరుతపులా.. లేక పెద్ద పులా అనేది గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు జరిపిస్తున్నారు. రైతుపై దాడికి పాల్పడిన పులి అడుగులు పెద్దపులి అడుగులతో పోలిస్తే చిన్నవిగా ఉండడంతో అధికారులు దాడికి పాల్పడింది చిరుత పులి కావచ్చని లేక తక్కువ వయసు కలిగిన పెద్ద పులి అయ్యి ఉంటుందని భావిస్తున్నారు.
కాగజ్నగర్ డివిజన్లోకి వెళ్లినట్లుగా..
జిల్లా సరిహద్దున గల మహారాష్ట్ర అటవీ ప్రాంతాల నుంచి ప్రాణహితను దాటుకొని పులులు జిల్లా అడవుల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆసిఫాబాద్ డివిజన్లోనికి ప్రవేశించిన పులి భీముపై దాడి చేసి నార్లపూర్- సామెల మీదుగా కాగజ్నగర్ పెద్దవాగు వైపు వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో పులి పగ్మార్క్ కోసం ప్రయత్నిస్తున్నామని, శుక్రవారం రాత్రి లోగా పూర్తి ఆధారాలు సేకరిస్తామని జిల్లా అటవీ అధికారి దినేశ్కుమార్ పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో పులులు దడపుట్టిస్తున్నాయి. పశువులతో పాటు చేలల్లో పనిచేసే మనుషులపైనా పంజా విసురుతుండడంతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కాగజ్నగర్ రూరల్, నవంబర్ 18: మండలంలోని బారెగూడ, శివాపూర్ గ్రామాల్లో అటవీశాఖ అధికారులు పులి ఆచూకీ కోసం శుక్రవారం డీఎఫ్వో దినేశ్కుమార్, కాగజ్నగర్ డివిజన్ అధికారి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. పాదముద్రల ఆధారంగా పులి రైల్వేగేట్ దాటి శివాపూర్, బారెగూడ, గ్రామాల వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పత్తి ఏరేందుకు వెళ్లిన రైతులు, కూలీలు ఇంటికి వెళ్లాలని సూచించారు. ఎక్కడైనా పులి ఆచూకీ కనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. గురువారం రాత్రి పట్టణంలోని వినయ్ గార్డెన్ సమీపంలో పలువురికి పులి కనిపించగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే వాంకిడి మండలంలోని తానాపూర్కు చెందిన భీమ్ రైతును చంపిన పులి అడుగులు, వినయ్ గార్డెన్ వద్ద లభించిన పులి అడుగులు ఒకేలా ఉన్నాయని డీఎఫ్వో తెలిపారు.