కోటపల్లి, ఏప్రిల్ 28 : ఇటీవల మహారాష్ట్ర నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన ఓ ఏనుగు ఇద్దరిని పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ప్రస్తుతం అది తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తుండగా, మళ్లీ మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై అధికారులు ముందస్తు వ్యూహం రచిస్తున్నారు. తెలంగాణ పోలీసులు, అధికారులు మహారాష్ట్ర అటవీ అధికారులను సమన్వయపర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఏనుగు సంచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నారు. ఏనుగు ఆవాసంగా ఉండేందుకు రెండు రాష్ర్టాలు అనుకూలంగా ఉండగా, ఒకవేళ అది ఇక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకుంటే ఏం చేద్దామనే ఆలోచనలో పడ్డారు.
మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చి ఇద్దరి మరణానికి కారణమైన ఏనుగు, తిరిగి గుంపుతో వచ్చే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి వచ్చిన ఏనుగుల గుంపు.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మకాం వేసింది. ఆ మంద నుంచి విడిపోయిన మగ ఏనుగు మన రాష్ట్రంలోకి వచ్చి భయాందోళనలు సృష్టించిన విషయం విదితమే. అది తిరిగి గుంపుతో మన రాష్ట్రంలోకి ప్రవేసిస్తే ఎలా ఎదుర్కోవాలని అటవీ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ విషయమై ఇటీవల అరణ్యభవన్లో సమావేశమై చర్చించారు.
ముఖ్యంగా ఏనుగులు రాత్రిపూట ఎక్కువగా సంచరించే అవకాశముండగా, సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకుగాను ఇప్పటికే మంచిర్యాల కలెక్టరేట్లో అటవీశాఖ, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ, పశువైద్య శాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏనుగు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో రేంజ్ అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు.
ఏనుగు కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు మరణించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దట్టమైన అటవీ ప్రాంతం కావడం, ఎక్కువ గ్రామాలు కూడా అడవుల్లోనే ఉండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు తెలిపారు.
ప్రస్తుతం ఏనుగుల గుంపు పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఉన్నందున అప్రమత్తంగా ఉన్నాం. ప్రస్తుతం ఏనుగు ఎక్కడ ఉంది.. ఎటు వెళ్తుంది అనే విషయాన్ని మహారాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి తెలుసుకుంటున్నాం. గ్రామాల్లో వలంటీర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఏనుగు వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– ఆర్ రవి, రేంజర్, కోటపల్లి