తాండూర్ : సీసీఐ ( CCI ) ద్వారా పత్తి కొనుగోళ్లు ( Cotton Purchase ) చేయాలని తాండూర్ మండలం రేపల్లెవాడ సమీపంలోని జిన్నింగ్ మిల్లుల వద్ద జాతీయ రహదారిపై పత్తి రైతులు ఆందోళన ( Farmers Protest ) చేపట్టారు. నాణ్యత లోపం పేరుతో అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించారు. పుచ్చు , తేమ ఉందని కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సీసీఐ అధికారులు పత్తి నాణ్యత చూసి షరతులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ రహదారిపై బైటాయించారు. ఈ నెల 20వ తేదీలోగా సీసీఐ ద్వారా పత్తిని కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం పత్తి రైతుల ఆవేదనను అర్ధం చేసుకొని పత్తి కొనుగోలు చేయాలని కోరారు.
సీసీఐ ఇన్చార్జి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చిన పత్తిలో చాలా వరకు పురుగుఉంటుందని, నాణ్యమైన పత్తి తీసుకురానందుకే కొనుగోలు చేయడం లేదని తెలిపారు. జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న తాండూర్ ఏఎస్సై రాజమౌళి సంఘటన స్థలానికి చేరుకొని రైతులు, సీసీఐ అధికారులతో మాట్లాడి దర్నాను విరమింప చేశారు.