ధరణిని ఎత్తేస్తే ఏమైతది.. దళారులు, పైరవీకారుల రాజ్యం పుట్టుకొస్తది. పైసలు ముట్టజెప్పందే ఫైలు ముందుకు కదలదు. ఏండ్లకేండ్లు, దుమ్ము పట్టినా సరే ఆ దస్ర్తాన్ని పట్టించుకునే నాథుడు ఉండడు. ఇంకా.. భూ రికార్డులు మారుతయ్. రాత పద్ధతి ఉంటుంది కాబట్టి భూ యజమానులకు తెలియకుండా ఒకరి భూమి మరొకరి పేరిట మార్చుకోవచ్చు. భూదందాలు, సెటిల్మెంట్లకు తెరలేసి గొడవలు, ఘర్షణలకు అవకాశం ఏర్పడుతుంది. పచ్చని పైరుతో కళకళలాడాల్సిన పల్లెలు రక్తంతో తడిసి ముద్దయ్యే చాన్స్ ఉంది. రైతుబీమా, రైతుబంధును పైరవీకారులు, దళారులు లంచాలు ఇవ్వనిదే అమలు చేయారు. ఎన్నారైల భూములకు కూడా రక్షణ లేకుండా పోతుంది. దీంతో కబ్జాకోరులు పుట్టుకొస్తరు. ఫలితంగా సన్న, చిన్నకారుల జీవితాలు బుగ్గిపాలవుతాయి. మొత్తానికి అన్నదాతలు తమ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది.
– ఆదిలాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ) : ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్న కాంగ్రెస్ తీరుపై కర్షకలోకం భగ్గుమంటున్నది. మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పవంటున్నారు. పాత పద్ధతిని తీసుకొచ్చి దళారీ వ్యవస్థను ప్రోత్సహించేలా కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. పట్టా పాస్బుక్లో కౌలుదారుని పేరును చేర్చి, రైతుతో సమానంగా వారికి కూడా హక్కులు కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై భయాందోళనకు గురవుతున్నారు. గతంలో తప్పుడు రికార్డుల కారణంగా అసలైన రైతులకు ప్రభుత్వ పథకాలు అందేవి కావు. దీంతో అనేక మంది రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు కాంగ్రెస్ పాలనలో చూశామని గుర్తు చేసుకుంటున్నారు.
ఇలాంటి సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ ధరణిని తేవడంతో రైతుల జీవితాలు బాగుపడ్డాయి.ధరణి ఆధారంగానే రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాత ఇంటికి చేరుతున్నాయి. ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతన్న ఇంటికే అందేలా.. ధరణి పోర్టల్ రైతులకు ఉపయోగపడుతున్నది. అలాగే భూముల క్రయ, విక్రయాల ప్రక్రియ నిమిషాల వ్యవధిలో పూర్తవడం వంటివి ధరణి కారణంగానే జరుగుతున్నాయి. ఇలా అన్ని విధాలుగా రైతులకు అండగా ఉన్న ధరణిపై కాంగ్రెస్ నాయకులు కుట్రలకు తెరలేపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి రైతుల మధ్య చిచ్చు పెట్టే యత్నాలను తిప్పి కొడతామని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
తాంసి, నవంబర్ 23 : ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన ధరణి వ్యవస్థ మంచిగున్నది. అల్కగా రిజిస్ట్రేషన్లు అవుతన్నయ్. దూరంల ఉన్న ఆఫీసుల చుట్టూ తిరిగే గోస తప్పింది. కానీ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ధరణిని బంగాళఖాతంల కలుపుతా అంటున్నడు. ఆ పార్టీకి చెందిన పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతున్నడు. వాళ్లకసలు బుర్ర ఉండి మాట్లాడుతున్నరో నాకైతే సమజైతలేదు. ధరణిని తీసేస్తే పట్వార్లు వస్తరు. మళ్లా లంచం తీసుకొనేటోళ్లు పుట్టుకొస్తరు. మళ్లా కార్యాలయాల కాడనే పడిగాపులు కాయాల్సి వస్తది. అందుకే ఆ పార్టీని నమ్మద్దు. ఓటుతో వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలె. మా రైతులంతా బీఆర్ఎస్ సర్కార్కు మద్దతు.
– గంగుల ప్రవీణ్, బండల్ నాగపూర్
ఇంద్రవెల్లి, నవంబర్ 23: కాంగ్రెస్ లీడర్లు ఎట్లుంటరు.. ఆ పార్టీ కథేంటి అనేది రైతులకు తెలిసినట్లు ఇంకెవ్వలకూ తెల్వదు. వాళ్ల అరిగోస పెట్టుకున్నదంటే ముందుగాల రైతులనే. గతంలో ఆఫీసుల్ల పని కావాలంటే లంచం ఇయ్యాల్సి వచ్చేది. గిప్పుడా కథ లేనేలేదు. ధరణి పోర్టల్తో ఈజీగా పనులైతున్నయ్. గత ప్రభుత్వాలు ఆ రికార్డులోని పల్లెల్లో గొడవలు, కొట్లాటలు ఉండేయి. కాంగ్రెస్ నాయకులు ధరణి తీసేసి భూమాత పోర్టల్ తీసుకొస్తమంటున్రు. అది వస్తే రైతుల భూములకు రక్షణ లేకుండా పోతుంది. పాత రోజలు వస్తయ్. రికార్డుల్లో పేర్లు మారుతయ్. ఆఫీసుల చుట్టూ తిరుగుడే అయితది. పైసా లేనిదే పని కాదు. అయినా కాంగ్రెసోళ్లు అప్పుడే కలలుకంటున్రు. వాళ్లు అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు. రైతులమంతా కేసీఆర్కు మద్దతు తెలుపుతున్నం. ఎట్లయిన గెలిపించుకుంటం.
– ఆత్రం హన్నుపటేల్, రైతు, మోడిగూడ
జైనథ్, నవంబర్ 23: ధరణితో రైతాంగానికి ఎంతో మేలు జరిగింది. రైతుల భూములకు రక్షణ ఏర్పడింది. రాష్ట్రం రాక ముందు దళారీలు, పైరవీకారుల రాజ్యం ఉండేది. ఎంతో కొంత ముట్టజెప్పితనే పనులయ్యేది. ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం ధరణి తేవడంతో ఆ తిప్పలు తప్పినయ్. భూమి రిజిస్ట్రేషన్ తొందరగా అయిపోతది. ఎవరికీ రుపాయి ఇవాల్సిన అవసరం లేదు. పట్టా దారు పాసుబుక్ ఇంటికే వస్తది. ధరణి తీసేస్తే మళ్లీ పాత పరిస్థితి వస్తది. రైతులకు కష్టాలు మొదలైతయ్. పైసల్లేకుండా ఏ పనీ కాదు. ఇంత మంచిగున్న ధరణిని తీసివేస్తామన్న కాంగ్రెస్ను ఎవరూ నమ్మరు. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే ఏం జరుగుతదో అందరికీ తెలుసు. అయినా వీళ్లు అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు. రైతులను ఆగం చేసేటోళ్లు మన నెత్తిమీదెందుకు..? మళ్లోసారి సీఎం కేసీఆరే రావాలె.
– బాస మాధవ్, కరంజి, జైనథ్ మండలం
ఇంద్రవెల్లి, నవంబర్23: నాడు భూముల విషయంలో పడిన గోస మర్సిపోలే. పాతపద్ధతిల రికార్డులతోని ఇబ్బందయ్యేది. గిప్పుడు ధరణి పోర్టల్ మంచిగున్నది. అంతా ఆన్లైన్లనే కావట్టి, భూములకు రక్షణ ఉంటది. మీ సేవకు సక్కగా పహానీలు చూసుకుంటున్నం. మళ్లా పాత పద్ధతంటే దళారీ రాజ్యం వస్తది. ఇగ కాగితాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలె. ధరణి వచ్చిన తర్వాత ఒకే దగ్గర మ్యూటేషన్, రిజిస్ట్రేషన్లు అయిపోతున్నయ్. రైతులకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చూట్టూ తిరిగే బాధలు తప్పినయి. ధరణి రద్దు చేస్తమంటున్న కాంగ్రెస్ మనకు అవసరం లేదు. ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ ఎనకటి రోజులు వస్తయ్. రైతుల సంక్షేమం కోసం పాటుపడే కేసీఆర్ ప్రభుత్వం గాక వేరే ఏది వచ్చినా రైతుల బతుకులు ఆగమైతయ్. రైతులను అన్ని విధాలా ఆదుకొనే బీఆర్ఎస్కు, కేసీఆర్ ప్రభుత్వానికే నా మద్దతు.
– అన్వర్-హీరాపూర్ రైతు
గుడిహత్నూర్, నవంబర్ 23: ధరణిని తెచ్చినంక పైరవీకారులు, రెవె న్యూ అధికారుల అక్రమాలకు చెక్ పడి ంది. ధరణికి ముందు పల్లెల్లో పైరవీకారులు, వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు ఆడిందే ఆటగా సాగింది. నాడు రైతుల పేర్లు, సర్వే నంబర్లు మార్చి అరిగోస పెట్టిన్రు. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ నెలలపాటు తిరిగేది. ఒక్కోసారి రెవెన్యూ అధికారులను కార్యాలయంలో బంధించిన సందర్భాలు ఉండేవి. ధరణి రావడంతో రైతుల బాధలు తీరినయ్. గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా పోయినయ్. కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇస్తే ఆగం చేస్తరు. ధరణిని తీసేస్తమని చెబుతున్రు. అట్లయితే రాబందుల రాజ్యం మళ్లీ మొదలైతది. అందుకే రైతులందరూ సమష్టిగా ఉంటం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లెయ్యం.
-కేశవ్ గిత్తె రైతు మన్నూర్
ఉట్నూర్ రూరల్, నవంబర్ 23 : కాంగ్రెస్ పార్టీ చెడగొట్టు పనులు చేసే విధంగా మాట్లాడుతోంది. ధరణి పోర్టల్ వల్ల రైతులకు మంచి జరిగితే కాంగ్రెస్ నాయకులకు మంచిగా అనిపిస్త లేదు. కాంగ్రెస్ మళ్లీ పటేల్, పట్వారీ కాలం నాటి రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చేలా మాట్లాడుతున్నారు. అప్పట్లో పహాణీ, నఖలుకు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే వాళ్లం. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించినంక తమ భూములు ఆన్లైన్లో ఎక్కడం వల్ల ఇబ్బందులు తప్పినయి. ఇంత మంచి ధరణిని తీసి వేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం బాధాకరం.
– రాథోడ్ వెంకట్రాం, రైతు, కొత్తగూడ గ్రామం, ఉట్నూర్ మండలం
సొనాల, నవంబర్ 23 : ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ధరణి ఫోర్టల్ను రద్దు చేస్తే పూర్వకాలం నాటి పైరవీల రాజ్యం వస్తుంది. దళారుల ప్రమేయం పెరిగి రైతుల భూములను గోల్మాల్ చేసే అవకాశం ఏర్పడుతుంది. రైతుల మధ్య అగాధం పెం చేందుకు కాంగ్రెస్ వాళ్లు ప్రయత్నం చేస్తున్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తే మళ్లీ రైతులకు గోస మొదలైనట్లే. పట్టాదారు స్థానంలో తిరిగి అనుభవదారు, మాన్యందారు కాలమ్లు పెట్టడంతో నిజమై న పట్టాదారుకు తిప్పలు తప్పవు. రోజుల తరబడి అధికారులు, లీ డర్ల చుట్టూ తిరిగే రోజులు మళ్లీ వస్తాయి. భూ సమస్య లేకుండా ఉండాలంటే ధరణి ఉండాల్సిందే.
– బండారి రఘు, రైతు, సొనాల