ఆదిలాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా మేరకు పంటలు కొనుగోలు చేస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మక్క పంట కోనుగోలు చేయదు. రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో ఈ పంటను సేకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో వానకాలంలో మక్క వేయాలా? వద్దా? అనే సందిగ్ధత రైతుల్లో నెలకొన్నది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరతో విక్రయించి నష్టపోవాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో యేటా వానకాలం, యాసంగిలో రైతులు మక్క సాగు చేస్తారు. వానకాలంలో 40 వేలు, యాసంగిలో 20 వేల ఎకరాల్లో పండిస్తారు. మొక్కజొన్న సాగుకు జిల్లాలో అనుకూలమైన వాతావరణం ఉండడంతో దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లు వస్తుంది. ప్రభుత్వం గతేడాది మక్క క్వింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించింది. రెండు సీజన్లలో పంటను సాగు చేసిన రైతులు మార్కెట్ యార్డుల్లోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. యాసంగిలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 3819 మ ంది రైతుల వద్ద నుంచి 2.19 లక్షల క్వింటాళ్ల పంటను కొనుగోలు చేయగా పంట విలువ రూ.52 కోట్ల వరకు ఉంటుంది.
రైతుల్లో ఆందోళన
ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండేండ్లుగా రైతులు పత్తి, సోయా, కంది పంటలకు ప్రత్యామ్నాయంగా మక్క వేస్తున్నారు. జిల్లాలో వానకాలం సీజన్లో 40 వేల ఎకరాల్లో మక్క సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే వానకాలం సాగు ఆలస్యం కాగా వర్షాల కారణంగా రైతులు విత్తనాలు వేస్తుండగా.. మక్క పంట విషయంలో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది మొక్కజొన్న మద్దతు ధర క్వింటాలకు రూ.2410 గా ప్రకటించింది. విత్తనాలు, ఎరువులు, కూలీలు, డీజిల్ ధరలు బాగా పెరగడంతో పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయి. రైతులు పండించిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..
రైతులు తమ ప్రాంతాల్లో అనుకూలమైన వాతావరణం, సాగులో అనుభవం, సాగునీటి సౌకర్యం, మార్కెటింగ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పంటలు వేస్తారు. రైతులు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. నేను గతేడాది వానకాలంలో మూడెకరాల్లో మక్క వేశా. ఈసారి పంటలను కొనుగోలు చేయమని ప్రభుత్వం ప్రకటించడంతో పంట వేయాలా? వద్దా? ఆనే ఆలోచన చేస్తున్నా. పెట్టుబడులు బాగా పెరిగిన కారణంగా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. లేనిచో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని రైతులు పండించిన అన్ని పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలి.
– మల్లేశ్, రైతు, సిరికొండ