కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/తిర్యాణి, ఏప్రిల్ 1 : తిర్యాణి మండల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చెలిమెల ప్రాజెక్టు నీరు రాక.. కరెంట్ సరిగా లేక పొట్ట దశలో ఉన్న వరి చేతికందకుండా పోయేదుస్థితి నెలకొంది. గతేడాది రంది లేకుంట రెండు పంటలు తీసిన రైతాంగం ఈ యాసంగిలో అష్టకష్టాలు పడుతున్నది.
తిర్యాణి మండల రైతులకు ప్రధాన సాగునీటి వనరు చెలిమెల(ఎన్టీఆర్) ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద యేటా యాసంగిలో దాదాపు 200 ఎకరాల్లో వరి సాగవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు కాలువలను ఆధునీకరించి యాసంగి సాగుకు భరోసానిచ్చింది. సరైన వర్షాలు లేనప్పుడు.. పంట కాలువల నీరు అందని సమయంలో రైతులు ఎంచక్కా 24 గంటల ఉచిత విద్యుత్తో బోరుబావుల ద్వారా పంటలు సాగు చేసుకున్నారు. గతేడాది ఈ ప్రాజెక్టు కింద దాదాపు 180 ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ యేడాది 80 ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. కాంగ్రెస్ సర్కారు ముందుచూపులేని తనంతో పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. చెలిమెల ప్రాజెక్టు కాలువల్లో పిచ్చిమొక్కలు నిండిపోయి సాగు నీరు పంటలకు చేరడం కష్టంగా మారింది. ప్రాజెక్టులో ఉన్న కొద్ది పాటి నీటిని కూడా రైతులు వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది.
చెలిమెల ప్రాజెక్టు ద్వారా నీరు అందకపోతే కనీసం బోరుబావుల నీళ్లు పెట్టుకుందామంటే.. కరెంట్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కేసీఆర్ సర్కారు అందించిన 24 గంటల ఉచిత కరెంట్తో సంబురంగా పంటలు తీసిన రైతులు, ఈ యేడాది భగీరథ యత్నం చేయాల్సి వస్తున్నది. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉండగా, ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. వ్యయప్రయాసలకోర్చి పంటలు వేశామని, కనీసం పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. కాంగ్రెస్ సర్కారు తక్షణమే స్పందించి 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని, ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేసి సాగు నీరందించాలని వేడుకుంటున్నారు.
గతేడాది నాకున్న మూడెకరాలతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి వేసిన. కేసీఆర్ సర్కారు పుణ్యమాని రంది లేకుంట పంట తీసిన. కరెంట్ ఉంటదో.. ఉండదోనని ఈ సారి నాకున్న మూడెకరాల్లోనే వరి సాగు చేసిన. అనుకున్నట్లే ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీరు అందడం లేదు. కరెంటు కూడా ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. పంట పొట్టదశకు వచ్చింది. దిగుబడి వస్తుందన్న నమ్మకం లేదు. ఎట్లా బతుకుడో ఏమో అర్థమైతలేదు.
– పల్లె సుధాకర్, నాయికపుగూడ, తిర్యాణి
కేసీఆర్ సర్కారులో ఒక్కసారి కూడా పంట ఎండలే. గతేడాది సంబురంగా పంట తీసినం. ఈ యాసంగిలో మూడెకరాల్లో వరి వేసిన. ఇప్పుడు పొట్టకు వచ్చింది. ఇంకో నాలుగు రోజులు పోతే కోతలే. గీ సమయంలో నీరందని పరిస్థితి వచ్చింది. చెలిమెల ప్రాజెక్టు కాలువలు అధ్వానంగా ఉన్నయి. నీరందే పరిస్థితి లేదు. బోరుబావుల్లో ఎంతోకొంత నీరున్నా కరెంట్ ఉండడం లేదు. కిందా..మీద పడి నీళ్లు పెడుతున్నా పొలం పారడం లేదు. గిట్లయితే మేము ఎట్లా బతుకుడు.
– గుండం వెంకన్న, నాయికపుగూడ, తిర్యాణి